ప్రభుత్వ బడి బతికితేనే పేద పిల్లలకు భవిష్యత్తు
కాకతీయ, వేములవాడ : ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ, విద్యార్థుల భవిష్యత్తు బలోపేతమే లక్ష్యంగా రుద్రంగి మండలం మానాల గ్రామ యువత వినూత్న నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ బడిలో చదివితేనే నాణ్యమైన విద్యతో పాటు సమాన అవకాశాలు లభిస్తాయనే సందేశంతో రూపొందించిన తీర్మాన పత్రాన్ని గ్రామ సర్పంచ్ బుర్ర శంకర్, ఉప సర్పంచ్ దాసరి అశోక్, వార్డు సభ్యులకు అందజేశారు. ప్రస్తుతం ప్రైవేట్ విద్యాసంస్థల మోజులో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతున్న నేపథ్యంలో, గ్రామంలోని ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని యువత కోరింది. సర్కారు బడుల్లో అర్హత కలిగిన ఉపాధ్యాయులు, ఉచిత పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజనం, యూనిఫాంలు వంటి సౌకర్యాలు ఉన్నాయని గుర్తు చేశారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్రభుత్వ విద్యకు మద్దతుగా తీర్మానం ఇవ్వడాన్ని పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, యువకులు పాల్గొన్నారు.

