మంత్రి రామలింగారెడ్డి రాజీనామా!
బెంగళూరు అభివృద్ధి శాఖ ఇస్తామని మాటిచ్చి తప్పారు
సాగునీటి శాఖ ఇవ్వడంపై శివకుమార్పై తీవ్ర అసంతృప్తి
ఇకపై ఎలాంటి మంత్రి పదవి ఇచ్చినా తీసుకోను
ఎమ్మెల్యేగా మాత్రమే కొనసాగుతానంటూ రామలింగారెడ్డి వెల్లడి
అంతర్గత విభేదాలు మొదలయ్యాయంటూ బీజేపీ విమర్శలు
ప్రమాణం చేసిన రెండు రోజులకే ప్రభుత్వానికి భారీ షాక్
బెంగళూరు : కర్ణాటకలో కొత్తగా కొలువుదీరిన డీకే శివకుమార్ ప్రభుత్వానికి ఊహించని భారీ షాక్ తగిలింది. బుధవారం ముఖ్యమంత్రితో పాటు మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సీనియర్ కాంగ్రెస్ నేత రామలింగారెడ్డి, కేవలం రెండు రోజులకే తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. తనకు కేటాయించిన మంత్రిత్వ శాఖపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన శుక్రవారం తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శికి పంపారు. నూతన ప్రభుత్వం ఏర్పడిన నలభై ఎనిమిది గంటల్లోనే ఈ పరిణామం చోటుచేసుకోవడం కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. శాఖల కేటాయింపులో ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తనను ఘోరంగా అవమానించారని రామలింగారెడ్డి మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. “డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోకముందు స్వయంగా నా ఇంటికి వచ్చారు. ఆయన సీఎం అయ్యాక బెంగళూరు అభివృద్ధి శాఖను నాకు ఇస్తానని స్వయంగా ఆయనే మాట ఇచ్చారు. నేను ఏనాడూ పదవుల కోసం ఒత్తిడి చేయలేదు, ఆయనే స్వయంగా ఇస్తానంటే సరే అన్నాను. ప్రమాణస్వీకారానికి ఒకరోజు ముందు కూడా ఇదే విషయాన్ని పునరుద్ఘాటించారు. కానీ గురువారం రాత్రి ప్రకటించిన జాబితాలో నాకు సాగునీటి శాఖను కేటాయించారు. ఇది నాకు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు” అని రామలింగారెడ్డి స్పష్టం చేశారు.
ఎమ్మెల్యేగానే ఉంటా.. ఏ శాఖ ఇచ్చినా వెనక్కి వెళ్లను!
ముఖ్యమంత్రి తన మాట తప్పడం వల్లే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు రామలింగారెడ్డి ప్రకటించారు. ఇప్పుడు ఒకవేళ అధిష్ఠానం జోక్యం చేసుకుని తనకు నచ్చిన బెంగళూరు అభివృద్ధి శాఖను ఆఫర్ చేసినప్పటికీ తాను మంత్రిగా బాధ్యతలు తీసుకోనని తేల్చి చెప్పారు. “నేను నా మంత్రి పదవికి మాత్రమే రాజీనామా చేశాను, కాంగ్రెస్ పార్టీకి కాదు. గత యాభై మూడు ఏళ్లుగా నేను పార్టీలోనే ఉన్నాను. ఇకపై కేవలం బీటీఎం లేఅవుట్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉంటూ సాధారణ కాంగ్రెస్ కార్యకర్తలా పనిచేస్తాను” అని ఆయన వెల్లడించారు. కాగా, కీలకమైన బెంగళూరు అభివృద్ధి శాఖను సీనియర్ నేత కృష్ణ బైరెగౌడకు కేటాయించడంతోనే ఈ వివాదం మొదలైనట్లు తెలుస్తోంది. గురువారం రాత్రి జరిగిన కేబినెట్ సమావేశంలో కూడా రామలింగారెడ్డి తీవ్ర అసంతృప్తితో మధ్యలోనే వాకౌట్ చేసినట్లు సమాచారం.
కాంగ్రెస్లో ముసలం.. బీజేపీ విమర్శలు!
రామలింగారెడ్డి రాజీనామాపై ప్రతిపక్ష బీజేపీ తక్షణమే స్పందించింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో అంతర్గత కుమ్ములాటలు అప్పుడే మొదలయ్యాయని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి విమర్శించారు. రాబోయే రోజుల్లో ఇలాంటి అసమ్మతి జ్వాలలు మరిన్ని చూస్తామని, ముఖ్యమంత్రిని మార్చినంత మాత్రాన కాంగ్రెస్లో మార్పు రాదని ఎద్దేవా చేశారు. మరోవైపు ఈ వివాదాన్ని సర్దుమణిగేలా చేసేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం రంగంలోకి దిగింది. రామలింగారెడ్డి పార్టీకి, రాష్ట్రానికి ఎంతో కీలకమైన నాయకుడని, ఆయనతో మాట్లాడి సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని మంత్రి ప్రియాంక్ ఖర్గే మీడియాకు తెలిపారు. బెంగళూరు నగరంలో కాంగ్రెస్కు బలమైన ముఖచిత్రంగా ఉన్న 73 ఏళ్ల రామలింగారెడ్డి, 8 సార్లు ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు గతంలో రవాణా, హోం శాఖల మంత్రిగా కూడా సేవలు అందించారు.

