ఉచిత క్రీడా శిబిరాం అభినందనీయ
క్రీడా క్రమశిక్షణతోనే జాతీయ స్థాయికి ఎదుగుదల
క్రీడాకారుల ప్రోత్సాహానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం
హన్మకొండ డీసీసీ అధ్యక్షుడు, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి
హెచ్సీఏ ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ శిక్షణ శిబిరం
వంగపల్లిలో ఘనంగా జరిగిన క్రికెట్ శిక్షణ శిబిరం ముగింపు వేడుకలు
క్రీడాకారులకు సర్టిఫికెట్లు, స్పోర్ట్స్ కిట్లను పంపిణీ చేసిన కుడా చైర్మన్
కాకతీయ, హనుమకొండ : యువతలోని క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సహకారంతో వరంగల్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ శిబిరాలు అభినందనీయమని హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం వంగపల్లిలోని డబ్ల్యూడీసీఏ మైదానంలో జరిగిన ఉచిత వేసవి క్రికెట్ శిక్షణ శిబిరం ముగింపు వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

క్రీడలకు ప్రభుత్వం ప్రాధాన్యం
ఈ సందర్భంగా ఇనగాల వెంకట్రామ్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు, క్రీడాకారుల ప్రోత్సాహానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. క్రీడలు యువతలో శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయని చెప్పారు. రాష్ట్రం నుంచి మరింత మంది క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా ప్రభుత్వం అన్ని రకాల వసతులను కల్పిస్తోందని వివరించారు. యువ క్రికెటర్లు క్రమశిక్షణతో శిక్షణను అందిపుచ్చుకోవాలని, ఫిట్నెస్పై ప్రత్యేక దృష్టి సారించాలని వెంకట్రామ్ రెడ్డి సూచించారు. నిరంతర సాధనతో క్రీడల్లో రాణించి భవిష్యత్తులో రాష్ట్ర, జాతీయ స్థాయిలో గొప్ప పేరు గడించాలని ఆకాంక్షించారు. అనంతరం శిక్షణ పూర్తి చేసుకున్న క్రీడాకారులకు ఆయన సర్టిఫికెట్లు మరియు స్పోర్ట్స్ కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డబ్ల్యూడీసీఏ నిర్వాహకులు, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు, సీనియర్ క్రీడాకారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, క్రీడాకారుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

