పేరుకే ఎమ్మెల్సీ.. పనులేమో దరిద్రాలు!
ఆయన ఫామ్ హౌస్లలో పేకాట, గంజాయి, డ్రగ్స్ దందా
శ్రీరంగనీతులు చెప్పే నాయకులకు అక్రమాలే అలవాటు
గుప్తనిధుల కోసం కొండలను కొల్లగొట్టిన ధర్మారెడ్డి
పోచంపల్లి,చల్లాపై ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి సంచలన ఆరోపణలు
నడికూడ మండలంలో అభివృద్ధి పనుల శంకుస్థాపనలో నిప్పులు చెరిగిన ఎమ్మెల్యే
కాకతీయ, పరకాల : పేరుకే ఎమ్మెల్సీ అని, చేసే పనులన్నీ దరిద్రపు పనులేనని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. నడికూడ మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. నాగారం గ్రామంలో మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమంపై ఆయన మండిపడ్డారు. విలువలతో కూడిన రాజకీయాలు చేయాల్సింది పోయి, చిల్లర మల్లర రాజకీయాలతో ప్రజలను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు శ్రీరంగనీతులు చెప్పే నాయకులు ఆచరణలో మాత్రం అక్రమాలకు పాల్పడుతున్నారని రేవూరి ఆరోపించారు. ఫామ్ హౌస్లలో పేకాట, గంజాయి, డ్రగ్స్, బ్రోకరేజ్ వంటి కార్యకలాపాలను అరికట్టాల్సిన బాధ్యత కలిగిన వారు, ఆ దందాలను ప్రోత్సహించి డబ్బులు సంపాదించుకున్నారని విమర్శించారు. అలాంటి వారు ఇప్పుడు ప్రజలకు నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలు గుర్తుకు రాని నాయకులు, పదవి పోయాక కుట్టు మిషన్ల పంపిణీ పేరుతో చేస్తున్న ప్రదర్శన కేవలం రాజకీయ డ్రామా మాత్రమేనని కొట్టిపారేశారు.
ప్రభుత్వ కార్యాలయాల్లో రౌడీయిజం
మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రభుత్వ కార్యాలయాలను పార్టీ కార్యాలయాలుగా మార్చడం సిగ్గుచేటని ఎమ్మెల్యే అన్నారు. నాగారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ కార్యక్రమాలు నిర్వహించడం వారి రౌడీయిజానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. గత పదేళ్లలో అధికారంలో ఉన్నప్పుడు దొరికిన కాడికి దోచుకుని ఆస్తులు కూడబెట్టుకున్న నాయకులు, ఇప్పుడు ప్రజాసేవ చేస్తున్నట్లు నటిస్తున్నారని చల్లా ధర్మారెడ్డిని ఉద్దేశించి విమర్శించారు.
గుప్తనిధుల కోసం గుట్టలను కొల్లగొట్టారు
కౌకొండ గుట్టలలో గుప్తనిధుల కోసం మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, ఆయన వియ్యంకుడు, అల్లుడితో కలిసి అర్ధరాత్రి తవ్వకాలు జరిపారని ఎమ్మెల్యే రేవూరి ఆరోపించారు. అంతేకాకుండా, గుట్టలను తవ్విన మట్టిని రోడ్డు నిర్మాణ పనులకు విక్రయించి కూడా అక్రమ లాభాలు పొందారని మండిపడ్డారు. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గత పదేళ్లలో హైదరాబాద్ చుట్టుపక్కల లెక్కలేనన్ని భూములను కొనుగోలు చేసి భారీగా ఆస్తులు కూడబెట్టారని, అక్రమంగా సంపాదించిన డబ్బుతోనే ఇప్పుడు ఈ రాజకీయ ప్రదర్శనలు చేస్తున్నారని ఆరోపించారు. పదవిలో ఉన్నా, లేకపోయినా ప్రజా సమస్యల పట్ల బాధ్యతగా ఉండాలని, ఇలాంటి అక్రమ రాజకీయాలకు స్వస్తి పలకాలని రేవూరి ప్రకాశ్ రెడ్డి హెచ్చరించారు. గతంలో అధికార పదవులు అనుభవించిన సమయంలో ప్రజలు గుర్తుకు రాని నాయకులకు ఇప్పుడు ప్రజలపై ప్రేమ పుట్టడం ఆశ్చర్యంగా ఉందని, ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని, సమయం వచ్చినప్పుడు తగిన తీర్పు ఇస్తారని హెచ్చరించారు.

