నగరంలో అభివృద్ధి పనుల వేగవంతం
మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య తనిఖీలు
సీఆర్జీ టవర్స్ వద్ద అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనుల పరిశీలన
నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని ఆదేశం
ఖమ్మం ఖిల్లా వద్ద రోప్వే నిర్మాణ పనులపై సమీక్ష
ప్రాజెక్టు పురోగతిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశాలు
కాకతీయ, ఖమ్మం టౌన్ : ఖమ్మం నగరంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, ఐఏఎస్, శుక్రవారం ఇంజినీరింగ్ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నగర అభివృద్ధిలో భాగంగా చేపట్టిన ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. మొదటగా సీఆర్జీ టవర్స్ పరిసర ప్రాంతంలో జరుగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ (యూజీడీ) పనులను కమిషనర్ పరిశీలించారు. పనుల ప్రస్తుత స్థితిగతులపై సంబంధిత ఇంజినీరింగ్ అధికారులు మరియు కాంట్రాక్టర్ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాబోయే 15 రోజులు మరియు నెల రోజుల వ్యవధిలో పనులు ఎంతవరకు పూర్తవుతాయనే అంశంపై ఆయన ఆరా తీశారు. పనులను మరింత వేగవంతం చేసేందుకు అదనపు మిషనరీని వినియోగించాలని, ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా నిర్ణీత గడువులోగా పనులను పూర్తి చేయాలని కమిషనర్ అధికారులను స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అనంతరం ఖమ్మం కిల్లా వద్ద నిర్మాణంలో ఉన్న ప్రతిష్ఠాత్మక రోప్వే ప్రాజెక్టు పనులను ఆయన పరిశీలించారు. ప్రస్తుతం జరుగుతున్న పనుల పురోగతి, తదుపరి చేపట్టాల్సిన కార్యకలాపాలు, గడువు తేదీల గురించి టూరిజం శాఖ ప్రతినిధులు మరియు కాంట్రాక్టర్తో సుదీర్ఘంగా చర్చించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి కార్యాచరణ ప్రణాళికను, దశల వారీ పురోగతి వివరాలను ఎప్పటికప్పుడు తనకు సమగ్ర నివేదిక రూపంలో తెలియజేయాలని కాంట్రాక్టర్ను కమిషనర్ ఆదేశించారు.

