సామ్రాజ్యవాదానికి ప్రత్యామ్నాయం కమ్యూనిజమే
ప్రపంచ దేశాలకు అతిపెద్ద శత్రువు సామ్రాజ్యవాదమే
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలపై దశలవారీగా ప్రజా ఉద్యమాలు
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు
వైరా డివిజన్ రాజకీయ శిక్షణ తరగతుల్లో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం
కాకతీయ, ఏన్కూర్ : ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారీ వ్యవస్థ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, నేటి సామ్రాజ్యవాదానికి ఏకైక ప్రత్యామ్నయం కమ్యూనిజమేనని సీపీఐ(ఎం) ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ప్రపంచ దేశాల అభివృద్ధికి, శాంతికి సామ్రాజ్యవాద శక్తులే అతిపెద్ద ప్రమాదంగా మారాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గ్లోబలైజేషన్ పూర్తిగా విఫలమై లోకలైజేషన్ ప్రారంభమైందని, పార్టీ శ్రేణులు ప్రజా సమస్యలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి ప్రజా ఉద్యమాలను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. శనివారం ఏన్కూరు మండలం తిమ్మారావుపేట గ్రామంలోని మోతుకూరి గార్డెన్స్ ఫంక్షన్ హాల్ నందు సీపీఐ(ఎం) వైరా డివిజన్ రాజకీయ శిక్షణా తరగతులు ఘనంగా ప్రారంభమయ్యాయి. కార్యక్రమం ప్రారంభంలో పార్టీ సీనియర్ నాయకులు గుండాల సత్యనారాయణ రెడ్డి ఎర్రజెండాను ఆవిష్కరించారు. ఈ శిక్షణా తరగతులకు పార్టీ జిల్లా కమిటీ సభ్యులు దుగ్గి కృష్ణ ప్రిన్సిపాల్గా వ్యవహరించారు. ఈ సందర్భంగా తిమ్మారావుపేట సర్పంచ్ గుగులోత్ సుమలతను శాలువా కప్పి నున్నా నాగేశ్వరరావు ఘనంగా అభినందించారు.
కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్ అనుకూల విధానాలపై మండిపాటు
అనంతరం “జాతీయ, అంతర్జాతీయ పరిస్థితులు” అనే అంశంపై నున్నా నాగేశ్వరరావు రాజకీయ క్లాసులను ప్రారంభించి మాట్లాడారు. భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటీకరిస్తోందని, కార్మిక చట్టాలను బలహీనపరుస్తూ వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు కట్టబెడుతోందని దుయ్యబట్టారు. ప్రజల అసలు సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకు మతోన్మాదం, కులవివక్ష, ద్వేష రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని, రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య హక్కులపై దాడులు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో కార్యకర్తలు రాజకీయంగా, సైద్ధాంతికంగా చైతన్యవంతులై ప్రజా ఉద్యమాలను నిర్మించాలని పిలుపునిచ్చారు. సాయంత్రం సెషన్లో పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకులు పి. సోమయ్య మాట్లాడుతూ.. కేంద్రంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలు ఎన్నికలకు ముందు అనేక వాగ్దానాలిచ్చి, అధికారంలోకి వచ్చినా వాటిని అమలు చేయడం లేదని విమర్శించారు. దేశంలో ఉపాధి, ఉద్యోగావకాశాలు లేక, మరోపక్క నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగి పేద, మధ్యతరగతి ప్రజలు దిక్కుతోచని స్థితిలో అల్లాడుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక సమస్యలను గుర్తించి ప్రజలను చైతన్యవంతులను చేస్తూ దశలవారీగా పోరాటాలు చేపట్టాలని పార్టీ శ్రేణులను కోరారు. ఈ శిక్షణ తరగతుల్లో పార్టీ వైరా డివిజన్ కార్యదర్శి భూక్య వీరభద్రం, జిల్లా కమిటీ సభ్యులు తాళ్లపల్లి కృష్ణ, సుంకర సుధాకర్, వివిధ మండలాల కార్యదర్శులు దొంతెబోయిన నాగేశ్వరరావు, చెరుకుమల్లి కుటుంబరావు, కుందనపల్లి నరేంద్ర, బాణాల శ్రీనివాసరావు, అంబటి శ్రీనివాసరెడ్డి, పార్టీ నాయకులు ఏల్పుల రాములు, ఇటికల లెనిన్, కాలసాని సాయి, రేగళ్ళ తిరుమలరావు, షేక్ జానీ, కాట్రేల బిక్షం, భూక్యా లచ్చు, డివిజన్, మండల కమిటీ సభ్యులు మరియు శాఖ కార్యదర్శులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

