ఉత్తరం కాకతీయ పత్రిక కథనాలు అక్షర సత్యాలు
విలేకరులపై బురద చల్లడం మానుకోవాలి
సీసీ కెమెరాల నిఘా, అధికారుల పర్యవేక్షణ శూన్యం
నడి గోదావరిలో లారీల లోడింగ్
: బీజేపీ నేత లింగంపల్లి రమేష్
త్వరలోనే బీజేపీ ఆధ్వర్యంలో ధర్నాలు
కాకతీయ, మణుగూరు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలో నిబంధనలు, చట్టాలకు పూర్తిగా వ్యతిరేకంగా ఇసుక ర్యాంపులు నడుస్తున్నాయని భద్రాద్రి జిల్లా బీజేపీ కౌన్సిల్ సభ్యుడు, హ్యూమన్ రైట్స్ జిల్లా ప్రధాన కార్యదర్శి లింగంపల్లి రమేష్ సంచలన ఆరోపణలు చేశారు. శనివారం ఆయన ‘కాకతీయ’ పత్రికతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఇసుక ర్యాంపుల్లో జరుగుతున్న దోపిడీపై గత కొన్ని రోజులుగా కాకతీయ పత్రికలో వస్తున్న కథనాలు నూటికి నూరు శాతం నిజమని కొనియాడారు. వాస్తవాలను నిర్భయంగా రాస్తున్న విలేకరులను టార్గెట్ చేస్తూ.. ఇసుక కాంట్రాక్టర్ శ్రీకర్ తన బినామీలతో పత్రికపై బురద చల్లే ప్రయత్నం చేయడం సరికాదని ఆయన హెచ్చరించారు.
నడి గోదావరిలో లారీలు.. ఏ జీవోలో ఉందో చూపించండి!
ఇటీవల జరిగిన ప్రెస్ మీట్లో శ్రీకర్ స్వయంగా గతంలో అక్రమాలు, అవినీతి జరిగాయని ఒప్పుకున్నారని.. మరి ఇప్పుడు ర్యాంపుల్లో అవినీతి జరగడం లేదా? అని లింగంపల్లి రమేష్ ప్రశ్నించారు. అమాయక గిరిజనులను అడ్డం పెట్టుకొని ఇసుక దందాతో కోట్ల రూపాయలు వెనకేసుకుంటున్నారని మండిపడ్డారు. గోదావరి నదిలో డీసిల్టేషన్ (పూడికతీత) పేరుతో పెద్ద ఎత్తున ఇసుక దోపిడీ సాగుతోందన్నారు. నిబంధనలను తుంగలో తొక్కి ఏకంగా నడి గోదావరిలోకి లారీలను దింపి ఇసుక లోడింగ్ చేయడం దుర్మార్గమని.. అలా నది లోపలికి వాహనాలు తీసుకెళ్లవచ్చని ఏ జీవోలో ఉందో పాలకులు, అధికారులు చూపించాలని డిమాండ్ చేశారు.
పట్టా భూముల పేరుతో అర్ధరాత్రి దందా
ఇసుక క్వారీల్లో ఎలాంటి సమయపాలన పాటించడం లేదని, అర్ధరాత్రుళ్లూ ఇష్టమొచ్చినట్లు తోలకాలు సాగిస్తున్నారని రమేష్ ఆరోపించారు. అంతకంటే ముఖ్యంగా పట్టా ల్యాండ్స్ (పట్టా భూములు) పరిధిలో డీసిల్టేషన్ పేరుతో అక్రమ తవ్వకాలు చేస్తున్నారని చెప్పారు. గోదావరి పాయ అవతలకు వెళ్లి, నీటిని తొలగించి మరీ నిబంధనలకు విరుద్ధంగా భారీ యంత్రాలను ఉపయోగించి దందా చేస్తున్నారన్నారు. ఇప్పటికీ ఎలాంటి రశీదులు లేని ‘జీరో’ లారీలు యథేచ్ఛగా తరలుతున్నాయని, అందుకే మణుగూరు, అశ్వాపురం, బూర్గంపాడు పోలీసులు ఆయా లారీలను పట్టుకుంటున్నారని గుర్తుచేశారు.
అధికారుల పర్యవేక్షణ శూన్యం.. బీజేపీ ఆధ్వర్యంలో పోరాటం
క్వారీల్లో నిబంధనల ప్రకారం ఉండాల్సిన సీసీ కెమెరాల పర్యవేక్షణ గానీ, మైనింగ్, రెవెన్యూ అధికారుల నిఘా గానీ ఎక్కడా కనిపించడం లేదని.. అధికారుల నిర్లక్ష్యం వల్లే కాంట్రాక్టర్లు గోదావరిని పూర్తిగా దోచేస్తున్నారని రమేష్ ధ్వజమెత్తారు. ఇసుక దందా అంశంపై తాము ఇప్పటికే బీజేపీ జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకులతో చర్చలు జరిపామని, త్వరలోనే పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళతామని స్పష్టం చేశారు. ఇప్పటికైనా అక్రమాలను అడ్డుకోకపోతే, నిబంధనలు ఉల్లంఘిస్తున్న ఇసుక ర్యాంపుల వద్ద బీజేపీ తరఫున పెద్ద ఎత్తున ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపడతామని లింగంపల్లి రమేష్ హెచ్చరించారు.

