దారి తప్పుతున్న ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు
కేటాయింపులు భారీగా ఉన్నా అమలులో శూన్యం
ప్రతి పోడు భూమికి ప్రభుత్వం పట్టాలివ్వాలి
పోరాటాలతోనే సమస్యల పరిష్కారం!
సీపీఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ ఛైర్మన్ మహ్మద్ మౌలానా
గిరిజన సమాఖ్య ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా బానోత్ రాంబాబు
కాకతీయ, ఖమ్మం : రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లుతుండడంతో గిరిజనులు తీవ్రంగా నష్టపోతున్నారని భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) రాష్ట్ర కంట్రోల్ కమిషన్ ఛైర్మన్ మహ్మద్ మౌలానా ఆవేదన వ్యక్తం చేశారు. బడ్జెట్లో ఏటా కోట్లాది రూపాయల కేటాయింపులు జరుగుతున్నా, అవి ఖర్చు కాకపోవడంతో గిరిజన ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోవడం లేదని, అంతా ‘అంకెలు గణం – అమలు శూన్యం’ అన్న చందంగా తయారైందని విమర్శించారు. తెలంగాణ గిరిజన సమాఖ్య విస్తృత స్థాయి సమావేశం ఆదివారం స్థానిక సిపిఐ కార్యాలయంలో బానోత్ రాంబాబు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మౌలానా మాట్లాడుతూ.. నిధులు పక్కదారి పడుతుండడం వల్లే ఏజెన్సీ ప్రాంతాలు వెనుకబడిపోతున్నాయని పేర్కొన్నారు.
పోడు భూములకు రైతు భరోసా ఇవ్వాలి
గతంలో సాగులో ఉన్న ప్రతి ఎకరా పోడు భూమికి పట్టా అందజేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిందని, కానీ దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న భూములను సైతం గిరిజనుల నుంచి లాక్కుంటున్నారని మౌలానా ఆరోపించారు. అటవీ, రెవెన్యూ శాఖల అధికారులు గిరిజనులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం తన హామీ మేరకు సాగులో ఉన్న ప్రతి ఎకరాకు పట్టా ఇవ్వాలని, లేని పక్షంలో గిరిజనులను సమీకరించి పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఇందిర జలప్రభ పథకం ద్వారా పోడు భూముల్లో బోర్లు వేసి విద్యుత్ సౌకర్యం కల్పించే అవకాశం ఉన్నా, ప్రస్తుతం ఆ పథకం పూర్తి స్థాయిలో అమలు కావడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పోడు భూములకు సైతం రైతు భరోసా వర్తింపజేయాలని, గిరిజన విద్యార్థులకు ప్రత్యేక ఉపకార వేతనాలు అందించి ఉన్నత విద్యకు తోడ్పాటునందించాలని డిమాండ్ చేశారు.
జిల్లా అధ్యక్షుడిగా రాంబాబు ఎన్నిక
పాల్వంచలో త్వరలో జరగబోయే తెలంగాణ గిరిజన సమాఖ్య రాష్ట్ర మహాసభలకు ఖమ్మం జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చేలా విస్తృత ప్రచారం నిర్వహించాలని మౌలానా పిలుపునిచ్చారు. కాగా, ఈ సమావేశంలో గిరిజన సమాఖ్య జిల్లా అధ్యక్షుడిగా బానోత్ రాంబాబును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్, గిరిజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు అజ్మీర రామ్మూర్తి, జిల్లా కార్యదర్శి బానోత్ జగన్, బానోత్ రామ్మూర్తి, పాల్తియా శ్రీనివాస్, వీరునాయక్ తదితరులు పాల్గొన్నారు.

