జంపన్న వాగు సుందరీకరణ
వాగుపై చెక్ డ్యాం నిర్మాణం చేపట్టాలి
మేడారం పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి
రోడ్ల విస్తరణకు త్వరిత గతిన అనుమతులు పొందాలి : మంత్రి సీతక్క
కాకతీయ, ములుగు ప్రతినిధి : మేడారం మహా జాతరకు విచ్చేసే కోట్లాది మంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అనసూయ సీతక్క అధికారులను ఆదేశించారు. గురువారం తాడ్వాయి మండలం మేడారంలో మంత్రి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావుతో కలిసి సమ్మక్క–సారలమ్మ వనదేవతలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మేడారంలో చేపడుతున్న అభివృద్ధి పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మేడారం ఇంగ్లీష్ మీడియం ఆశ్రమ పాఠశాలలో వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటి, హరిత హోటల్లో సమీక్ష సమావేశం నిర్వహించారు.

రహదారుల విస్తరణకు అత్యంత ప్రాధాన్యత
మంత్రి సీతక్క మాట్లాడుతూ మేడారం మహా జాతరకు వచ్చే భక్తులకు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా మేడారం–తాడ్వాయి, పస్రా–మేడారం, చిన్నబోయినపల్లి–కొండాయి–ఊరట్టం రహదారుల విస్తరణకు యుద్ధ ప్రాతిపదికన అంచనాలు సిద్ధం చేయాలని, అవసరమైన అనుమతులను త్వరితగతిన పొందేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వనదేవతల దర్శనానికి వచ్చే భక్తులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. క్యూ లైన్లను ఆధునికీకరించడంతో పాటు ఆలయ పరిసర ప్రాంతాల్లో డ్రైనేజీ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు.
జంపన్న వాగు సుందరీకరణ మరియు చెక్డ్యామ్
జంపన్న వాగు పరిసర ప్రాంతాలను సుందరీకరించి, జంపన్న వాగుపై చెక్డ్యామ్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి సూచించారు. దీని ద్వారా భక్తులకు ఏడాది పొడవునా పుణ్యస్నానాలు ఆచరించేందుకు నీరు అందుబాటులో ఉండే అవకాశం ఉంటుందని, ఈ అంశంపై రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించారని పేర్కొన్నారు. ప్రధాన రహదారుల ఇరువైపులా, డివైడర్ల మధ్య పచ్చదనాన్ని పెంపొందించేలా పెద్దఎత్తున మొక్కలు నాటాలని, నూతనంగా ఏర్పాటు చేయనున్న స్మృతి వనాన్ని సహజసిద్ధమైన పచ్చదనంతో అభివృద్ధి చేయాలని సూచించారు. భక్తుల కోసం కాటేజీలు, విశ్రాంతి కేంద్రాల ఏర్పాటుకు సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు.
పరిశుభ్రత మరియు పర్యావరణ పరిరక్షణ
ఆలయ పరిసరాలతో పాటు మొత్తం మేడారం ప్రాంతాన్ని పారిశుధ్య కార్మికుల ద్వారా నిరంతరం పరిశుభ్రంగా ఉంచాలని, దుకాణదారులు తమ పరిసరాలను పరిశుభ్రంగా నిర్వహించేలా అధికారులు పర్యవేక్షించాలని మంత్రి సూచించారు. రహదారులపై చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలు వేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా తాగునీరు, పారిశుధ్యం, విద్యుత్, రవాణా, వైద్య సేవలు, భద్రత తదితర అన్ని మౌలిక సదుపాయాలను ముందస్తుగా సిద్ధం చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ప్రకృతిని మనం రక్షిస్తే ప్రకృతి మనలను రక్షిస్తుందనే భావనతో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యతను కూడా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి లెనిన్ వత్సల్ టోప్పో, జిల్లా అటవీ అధికారి వికాస్ మీనా, అదనపు కలెక్టర్లు సిహెచ్ మహేందర్ జి, సంపత్రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కళ్యాణి, ఆర్డీవో కృష్ణవేణి, జిల్లా అధికారులు, ఆలయ పూజారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

