అక్రమంగా ఎన్ఓసీ
నిబంధనలకు విరుద్ధంగా రెడీ మిక్స్ కాంక్రీట్ ప్లాంట్కు అనుమతి
కోరం లేకుండానే జీఎస్ఆర్ కంపెనీకి అనుకూలంగా తీర్మానం
తీర్మానంపై కేవలం 29 మంది సంతకాలు
పంచాయతీ కార్యదర్శి ఏకపక్ష నిర్ణయం
మూడు కుంటల నాలా కన్వర్షన్తో.. ఏడెకరాల్లో రెడీ మిక్స్ ప్లాంట్
డీపీఓకు ఫిర్యాదు చేసిన స్థానిక రైతులు
అధికారుల స్పందన కోసం నిరీక్షణ
కాకతీయ, మయూరి సెంటర్ : ఖమ్మం రూరల్ మండలం కాచిరాజుగూడెం గ్రామంలో జాతీయ రహదారి పనుల కోసం జీఎస్ఆర్ కంపెనీ ఏర్పాటు చేసిన రెడీ మిక్స్ కాంక్రీట్ (ఆర్ఎంసీ) ప్లాంట్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. పర్యావరణ నిబంధనలను, పంచాయతీరాజ్ చట్టాలను తుంగలో తొక్కి, గ్రామ పంచాయతీ కార్యదర్శి సదరు కంపెనీకి అక్రమంగా ఎన్ఓసీ జారీ చేశారనే ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం-2018 ప్రకారం, ఏదైనా పరిశ్రమకు ఎన్ఓసీ ఇచ్చే ముందు గ్రామ పంచాయతీ నోటీస్ బోర్డులో ఏడు రోజుల పాటు ప్రజల అభ్యంతరాలను స్వీకరించాలి. అనంతరం గ్రామసభ నిర్వహించి, తగినంత ‘కోరం’తో తీర్మానం ఆమోదించాకే అనుమతులు ఇవ్వాలి. 1800 మంది ఓటర్లు ఉన్న కాచిరాజుగూడెం గ్రామంలో, చట్టం ప్రకారం గ్రామసభ ఆమోదానికి కనీసం 150 మంది సభ్యుల సంతకాలు అవసరం. కానీ, కార్యదర్శి నిబంధనలకు విరుద్ధంగా కేవలం 29 మంది సంతకాలతోనే తీర్మానం పూర్తయినట్లు చూపించి, జీఎస్ఆర్ కంపెనీకి ఎన్ఓసీ జారీ చేయడం ఇప్పుడు పెద్ద వివాదంగా మారింది.

ఎన్ఓసీ జారీలో ‘ప్రొసీజర్’ ఉల్లంఘన
గ్రామ పంచాయతీ కార్యదర్శి అనుసరించాల్సిన ప్రాథమిక సూత్రాలను ఇక్కడ పూర్తిగా పక్కన పెట్టారు. నోటీస్ బోర్డులో కంపెనీ పేరు, సర్వే నంబర్, విస్తీర్ణం వివరాలతో ఏడు రోజుల పాటు నోటీసు ఉంచకుండానే, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు. కనీసం సదరు భూమికి పక్కనే ఉన్న రైతులకు కూడా సమాచారం ఇవ్వకుండానే, రహస్యంగా గ్రామసభ తీర్మానం ఆమోదించినట్లు సృష్టించడంపై రైతులు మండిపడుతున్నారు. అంతేకాకుండా, కేవలం పంచాయతీ ఎన్ఓసీనే కాకుండా, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, మండల తాసిల్దార్ నుంచి ల్యాండ్ కన్వర్షన్ (నాలా), విద్యుత్ శాఖ అనుమతులు కూడా తీసుకోకుండానే ప్లాంట్ పనులు మొదలుపెట్టడం దారుణమని రైతులు వాపోతున్నారు.


అసలు ‘ఎన్ఓసీ’ చెల్లదు!
నిబంధనల ప్రకారం నోటీసు గడువు పూర్తి కాకముందే తీర్మానం చేయడం, తగినంత కోరం లేకపోవడం చట్టరీత్యా చెల్లదు. ” కేవలం మూడు కుంటలకే నాలా అనుమతులు తీసుకుని, నిబంధనలకు విరుద్ధంగా ఏడు ఎకరాల్లో ప్లాంట్ పెట్టినా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడం వెనుక ఆంతర్యమేమిటి?” అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. గ్రామపంచాయతీ ఆదాయానికి గండి కొడుతూ, భూసారాన్ని నాశనం చేస్తున్న ఈ అక్రమ ప్లాంట్పై తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
డీపీఓకు ఫిర్యాదు.. చర్యల కోసం ఎదురుచూపులు
ఈ అక్రమ ఎన్ఓసీ వ్యవహారంపై స్థానిక రైతు ఖమ్మం జిల్లా పంచాయతీ అధికారికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. గ్రామసభ ఆమోదం పేరుతో జరిగిన తప్పుడు తీర్మానాన్ని రద్దు చేయాలని, నిబంధనలను ఉల్లంఘించిన పంచాయతీ కార్యదర్శిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. చట్టాన్ని రక్షించాల్సిన బాధ్యత కలిగిన కార్యదర్శే నిబంధనలను తుంగలో తొక్కితే, ఇక ప్రజల పరిస్థితి ఏమిటని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. సంబంధిత ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించి, తక్షణమే ఎన్ఓసీని రద్దు చేసి, ప్లాంట్ నిర్వహణను నిలిపివేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. కార్యదర్శిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటారా లేదా అనేది ఇప్పుడు వేచి చూడాలి.

