- నూతన బాధ్యతలు చేపట్టిన నాయకులు
- డీసీసీ నాయకుడిగా తూం జలపతి
- జిల్లా కార్యదర్శులుగా జక్కు మోహన్, బానోత్ రాందాస్ బాధ్యతల స్వీకరణ
- పార్టీ బలోపేతం, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పునరుద్ఘాటన
- ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, చైర్మన్ మానాల మోహన్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు
కాకతీయ, రుద్రంగి : రుద్రంగి మండలం ఉమ్మడి మానాల ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి కొత్త ఉత్సాహం, కొత్త దిశను తీసుకువచ్చేలా పలువురు సీనియర్ నాయకులు నూతన బాధ్యతలను అధికారికంగా స్వీకరించారు. పార్టీ అధిష్ఠానం తమపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పనిచేస్తామని నూతన నాయకత్వం ప్రకటించింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా అభినందనలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేశాయి. కాంగ్రెస్ పార్టీ జిల్లా కమిటీలో డీసీసీ నాయకుడిగా తూం జలపతి, జిల్లా కార్యదర్శులుగా జక్కు మోహన్, బానోత్ రాందాస్ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, ప్రతి కార్యకర్తకు అండగా నిలవడం, ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయడం తమ ప్రధాన కర్తవ్యమని తెలిపారు.
నేతలకు కృతజ్ఞతలు
తమపై విశ్వాసం ఉంచి ఈ బాధ్యతలు అప్పగించిన వేములవాడ శాసనసభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, రాష్ట్ర సహకార సంఘాల యూనియన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కే.కే. మహేందర్ రెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్లకు నూతన నాయకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వారి నాయకత్వంలో పార్టీని మరింత బలోపేతం చేసి ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టేందుకు అంకితభావంతో పనిచేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మానాల ఉప సర్పంచ్ దాసరి అశోక్, రిటైర్డ్ ఏడీఈ భూక్యా లక్ష్మణ్ నాయక్, మాజీ కారోబార్ బానోత్ గంగాధర్, బడితండా వీడీసీ చైర్మన్ గుగులోత్ మదన్ నాయక్, ఉపసర్పంచ్ సరోజ వినోద్, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు గుగులోత్ సంతోష్ నాయక్, దేగావత్ తండా అధ్యక్షుడు దేగావత్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

