కేంద్ర నిధులతోనే నగర అభివృద్ధి
రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక్క రూపాయి కూడా తేలేదు
కాంగ్రెస్ నేతలు గొప్పలు చెప్పుకోవడం మానుకోవాలి
కేంద్ర పథకాలతోనే కీలక అభివృద్ధి పనులు
కరీంనగర్కు ప్రత్యేకంగా రూ.1,000 కోట్ల ప్యాకేజీ తేవాలి
ఆర్వోబీ పనులు ముందుకు సాగకపోవడంపై ప్రశ్నలు
బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్రావు
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ నగర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్న నిధులే ప్రధాన ఆధారమని, రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నగర అభివృద్ధి కోసం ఒక్క భారీ పథకాన్ని కూడా తీసుకురాలేదని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నగర డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్రావు అన్నారు. కేంద్ర పథకాల ద్వారా వస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వ ఘనతగా కాంగ్రెస్ నేతలు చెప్పుకోవడం మానుకోవాలని సూచించారు. కరీంనగర్లోని ఎస్బీఎస్ ఫంక్షన్హాల్లో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు మూడేళ్లు గడుస్తున్నా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు నగర అభివృద్ధికి ప్రత్యేకంగా ఒక్క భారీ పథకాన్ని తీసుకురాలేదని ఆరోపించారు. కేంద్ర నిధులతో జరుగుతున్న పనులను రాష్ట్ర ప్రభుత్వ ఘనతగా చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు.
కేంద్ర పథకాలతోనే కీలక పనులు
కరీంనగర్లో చేపట్టిన స్మార్ట్సిటీ, అమృత్-1, అమృత్-2, యూఐడీఎఫ్, యూసీఎఫ్, సీఆర్ఎఫ్ తదితర పథకాలు కేంద్ర ప్రభుత్వ చొరవతోనే వచ్చాయని సునీల్రావు తెలిపారు. స్మార్ట్సిటీ ప్రాజెక్టులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెరో 50 శాతం వాటా ఉందని, మొత్తం 46 పనుల్లో 41 పూర్తయ్యాయని చెప్పారు. అమృత్ పథకం రెండు విడతల్లో రూ.274 కోట్లు, మూడో విడతలో మరో రూ.80 కోట్లు కరీంనగర్కు వచ్చినట్లు వివరించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్కుమార్ చొరవతో అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద రూ.840 కోట్ల నిధులు సమకూరే అవకాశం ఏర్పడిందన్నారు.
రూ.1,000 కోట్ల ప్యాకేజీ తేవాలి
నగర అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కనీసం రూ.1,000 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ తీసుకురావాలని కాంగ్రెస్ నేతలకు సవాల్ విసిరారు. రూ.1,000–2,000 కోట్ల ప్రత్యేక నిధులు తీసుకొస్తే కాంగ్రెస్ నేతలకు పౌర సన్మానం చేస్తామని ప్రకటించారు. రైల్వే ఓవర్ బ్రిడ్జి విషయంలో కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారని, అయితే నిధులు తెచ్చింది ఎవరు, టెండర్లు పిలిచింది ఎవరు, ఇప్పటివరకు భూసేకరణ ఎందుకు పూర్తికాలేదని ప్రశ్నించారు. సేతుబంధన్ కింద కేంద్రం రూ.156 కోట్లు కేటాయించినా రాష్ట్ర ప్రభుత్వం పనులను ముందుకు తీసుకెళ్లడం లేదని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ నిధులు లేని ఒక్క పథకాన్నైనా కాంగ్రెస్ నేతలు చూపించాలని సునీల్రావు డిమాండ్ చేశారు. కరీంనగర్ నగరపాలక సంస్థ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఏ పథకం ద్వారా నిధులు తీసుకొచ్చిందో ప్రజలకు వివరించాలని కోరారు. బండి సంజయ్కుమార్ చొరవతోనే కరీంనగర్ను యూసీఎఫ్ పథకంలోకి తీసుకురావడం సాధ్యమైందని, కేంద్ర ప్రభుత్వం గ్యారెంటీతో హడ్కో ద్వారా రాష్ట్రానికి నిధులు సమకూరే అవకాశం ఏర్పడిందని తెలిపారు.

