నవాబుపేటలో ఘనంగా పోచమ్మ బోనాలు
కాకతీయ, చిగురుమామిడి: చిగురుమామిడి మండలం నవాబుపేటలో రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం పోచమ్మ బోనాల మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. మహిళలు బోనాలు ఎత్తుకుని డప్పు చప్పుళ్లు, శివసత్తుల పూనకాలు, బైండ్ల నృత్యాల మధ్య పోచమ్మ ఆలయానికి చేరుకుని అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ప్రత్యేక పూజలు చేశారు. రెడ్డి సంఘం సభ్యులు ఐక్యమత్యంతో సంఘం అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో అధ్యక్షుడు సంధి శ్రీనివాస్రెడ్డి, ఉపాధ్యక్షుడు దేవసాని శ్రీనివాస్రెడ్డి, కార్యదర్శి గుర్రాల శ్రీనివాస్రెడ్డి, కోశాధికారి కాంతాల అజేందర్రెడ్డితో పాటు పలువురు సంఘం నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

