భూ రీ సర్వేతో భూధార్ కార్డు
డిజిటల్ మ్యాప్తో భూముల వివరాల నమోదు
రైతుల సమక్షంలోనే హద్దుల నిర్ధారణ
సర్వే పూర్తయిన వెంటనే విస్తీర్ణం వివరాలు
లోపాలు, వ్యత్యాసాలకు శాశ్వత పరిష్కారం
భవిష్యత్తులో భూ వివాదాలు గణనీయంగా తగ్గుతాయి
ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్
కాకతీయ, ఖమ్మం టౌన్ : భూ రీ సర్వేతో రైతుల భూములపై ఉన్న వివాదాలు, విస్తీర్ణ వ్యత్యాసాలు, రికార్డుల్లోని లోపాలను పారదర్శకంగా పరిష్కరించడమే ప్రభుత్వ ఉద్దేశమని జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్వహిస్తున్న రీ సర్వే అనంతరం ప్రతి రైతు భూమికి డిజిటల్ మ్యాప్తో కూడిన భూధార్ కార్డు అందుతుందని పేర్కొన్నారు. సత్తుపల్లి నియోజకవర్గంలోని బేతుపల్లి, నారాయణపురం, గంగారం గ్రామాల్లో కొనసాగుతున్న భూ రీ సర్వేను మంగళవారం సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్తో కలిసి కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గంగారం గ్రామంలో పంట పొలాల్లో రైతుల సమక్షంలో జరుగుతున్న సర్వేను పరిశీలించి, రైతులతో మాట్లాడి వారి సందేహాలను నివృత్తి చేశారు.
రైతుల సమక్షంలోనే హద్దుల నిర్ధారణ
బేతుపల్లి రెవెన్యూ పరిధిలోని గంగారం, బేతుపల్లి, నారాయణపురం, రామగోవిందపురం, ఎం.వి.పాలెం, రామనగర్, పాకాలగూడెం గ్రామాల్లో సుమారు 12 వేల ఎకరాల్లో రీ సర్వే కొనసాగుతోందని కలెక్టర్ తెలిపారు. పది బృందాలతో ఇప్పటివరకు నాలుగు వేల ఎకరాల్లో సర్వే పూర్తయిందన్నారు. రైతులకు 48 గంటల ముందుగానే నోటీసులు ఇచ్చి, వారి సమక్షంలోనే భూములను కొలుస్తామని చెప్పారు. పక్క భూముల రైతులను కూడా పిలిచి పంచనామా నిర్వహించి హద్దులను నిర్ధారిస్తామన్నారు. పట్టాదారు పాస్పుస్తకాలు లేకపోవడం, ఆన్లైన్లో పేర్లు నమోదు కాకపోవడం, రికార్డుల్లోని విస్తీర్ణానికి క్షేత్రస్థాయిలో ఉన్న భూమికి తేడాలు ఉండటం వంటి సమస్యలను రీ సర్వేతో పరిష్కరిస్తామని కలెక్టర్ తెలిపారు. సర్వే పూర్తయిన వెంటనే నమోదైన విస్తీర్ణాన్ని రైతులకు అక్కడికక్కడే తెలియజేస్తామన్నారు. గ్రామాల్లో భూ వివరాలను ప్రకటించి, పంచాయతీ, తహసీల్దార్ కార్యాలయాల్లో నోటీసు బోర్డులపై ఉంచుతామని చెప్పారు. అభ్యంతరాలను స్వీకరించి పరిష్కరించిన అనంతరం వివరాలను ఆన్లైన్లో నమోదు చేసి భూధార్ కార్డులు జారీ చేస్తామన్నారు. రీ సర్వే పూర్తయితే భవిష్యత్తులో భూ వివాదాలు గణనీయంగా తగ్గి రైతులకు శాశ్వత భద్రత కలుగుతుందని దివాకర టీఎస్ తెలిపారు. కార్యక్రమంలో సత్తుపల్లి తహసీల్దార్ సత్యనారాయణ, గ్రామ సర్పంచులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు.

