పత్తి కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు చేయాలి
రైతులకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా చూడాలి
15–30 రోజుల్లో అన్ని జిల్లాల్లో మిల్లులు ప్రారంభించాలి
మానిటరింగ్ కమిటీల్లో రైతులకు చోటు కల్పించాలి
కపాస్ కిసాన్ యాప్లో స్లాట్ బుకింగ్ సరళీకరణ
ఎంఎస్పీ కంటే తక్కువకు అమ్మే పరిస్థితి రావొద్దు
అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు
వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
కాకతీయ, తెలంగాణ బ్యూరో / ఖమ్మం : 2026–27 పత్తి సీజన్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పత్తి కొనుగోళ్లను పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. రైతు పండించిన పంటకు కనీస మద్దతు ధర అందేలా ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. పత్తి కొనుగోళ్లలో మధ్యవర్తుల జోక్యానికి అవకాశం ఇవ్వొద్దని, గత సీజన్లలో చోటుచేసుకున్న లోపాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. హైదరాబాద్లోని గోల్కొండ హోటల్లో సీసీఐ అధికారులతో పత్తి కొనుగోళ్ల ఏర్పాట్లపై మంత్రి సమీక్ష నిర్వహించారు. “మనం బతకాలంటే రైతు బతకాలి” అన్న విషయాన్ని అధికారులు గుర్తుంచుకుని పనిచేయాలని తుమ్మల అన్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేసి పత్తి రైతులకు మద్దతు ధర అందేలా చూడాలని సూచించారు. పంట కోతకు దాదాపు రెండు నెలల ముందుగానే కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించడం ద్వారా సమస్యలను ముందుగానే గుర్తించి పరిష్కరించే అవకాశం ఉంటుందన్నారు.

25.85 లక్షల టన్నుల దిగుబడి అంచనా
2026–27 సీజన్లో రాష్ట్రంలో సుమారు 46.33 లక్షల ఎకరాల్లో పత్తి సాగు జరుగుతుందని, దాదాపు 25.85 లక్షల మెట్రిక్ టన్నుల పత్తి ఉత్పత్తి అయ్యే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. లాంగ్ స్టేపుల్ కాటన్కు కేంద్రం ఈసారి క్వింటాల్కు రూ.8,667 ఎంఎస్పీ ప్రకటించిందని, గత ఏడాదితో పోలిస్తే రూ.557 పెరిగిందని వివరించారు. అర్హత కలిగిన ప్రతి రైతుకు ఎంఎస్పీ ప్రయోజనం అందేలా చర్యలు తీసుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులు ఎంఎస్పీ కంటే తక్కువ ధరకు పత్తిని విక్రయించాల్సిన పరిస్థితి రాకూడదని ఆదేశించారు. రాష్ట్రంలోని 356 జిన్నింగ్ మిల్లులను నోటిఫై చేసి కొనుగోళ్లు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎల్–1 నుంచి ఎల్–12 వరకు అన్ని కేటగిరీల మిల్లులను అవసరానికి అనుగుణంగా ప్రారంభించాలని, 15 నుంచి 30 రోజుల వ్యవధిలో అన్ని జిల్లాల్లో మిల్లులు అందుబాటులోకి వచ్చేలా చూడాలని అన్నారు.
131 సీసీఐ కేంద్రాలు
గత సీజన్లో 122గా ఉన్న సీసీఐ కొనుగోలు కేంద్రాలను ఈసారి 131కు పెంచినట్లు తుమ్మల తెలిపారు. అన్ని కేంద్రాలను పూర్తిస్థాయిలో పనిచేసేలా ముందస్తు ఏర్పాట్లు చేయాలని, పత్తి రాక అధికంగా ఉండే ప్రాంతాల్లో అవసరమైతే అదనపు కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఒక ప్రాంతంలో జిన్నింగ్ మిల్లు అందుబాటులో లేకపోతే సమీపంలోని నోటిఫైడ్ మిల్లుకు గ్రామాలు, మండలాలను అనుసంధానం చేసి రైతులు ఎక్కువ దూరం వెళ్లకుండా చూడాలని ఆదేశించారు. ప్రతి జిల్లాలో కలెక్టర్ ఆధ్వర్యంలో పనిచేసే మానిటరింగ్ కమిటీల్లో రైతు ప్రతినిధులను కూడా భాగస్వాములను చేయాలని సూచించారు. మార్కెట్ యార్డులు, జిన్నింగ్ మిల్లుల వద్ద రద్దీని క్రమబద్ధీకరించాలని, అవసరమైతే సాయంత్రం 6 గంటల తర్వాత కూడా కొనుగోళ్ల సమయాన్ని పొడిగించాలని చెప్పారు. అధికారులు కార్యాలయాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో కొనుగోలు కేంద్రాలను పరిశీలించి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించాలని ఆదేశించారు.
స్లాట్ బుకింగ్ సులభతరం చేయాలి
కపాస్ కిసాన్ యాప్లో స్లాట్లు తెరిచే ముందు జిల్లా కలెక్టర్, జిల్లా మార్కెటింగ్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో పాటు రైతులకు విస్తృత ప్రచారం చేయాలని మంత్రి సూచించారు. స్లాట్ బుకింగ్ విధానాన్ని మరింత సరళీకృతం చేయాలని, ఒక రైతు లేదా మొబైల్ నంబర్కు అవసరమైన విధంగా మల్టిపుల్ బార్కోడ్ సౌకర్యం కల్పించాలని అన్నారు. పంట బుకింగ్ డేటాను ఎన్ఐసీ ద్వారా కపాస్ కిసాన్ యాప్కు వేగంగా బదిలీ చేయాలని, రాష్ట్ర సగటు దిగుబడిని ప్రకటించి దానికంటే అధిక దిగుబడి సాధించిన రైతులకు ఏఈవోల ద్వారా డిజిటల్ యీల్డ్ సర్టిఫికెట్లు వెంటనే జారీ చేయాలని ఆదేశించారు. పత్తి అధికంగా ఉత్పత్తి అయ్యే జిల్లాల్లో అవసరమైన మేరకు కాటన్ టెస్టింగ్ ల్యాబ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. అన్ని నోటిఫైడ్ జిన్నింగ్ మిల్లుల్లో స్టేపుల్ లెంగ్త్, మైక్రోనెయిర్, తేమశాతం తదితర నాణ్యత ప్రమాణాలను పరీక్షించే పరికరాలు తప్పనిసరిగా ఉండాలని, కొనుగోలు కేంద్రాల్లో సీసీ కెమెరాలు పనిచేసేలా చూడాలని, తూకం యంత్రాలను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని ఆదేశించారు.
ఫిర్యాదులకు ప్రత్యేక హెల్ప్లైన్
రైతులకు ఎంఎస్పీ, కొనుగోలు కేంద్రాలు, నాణ్యత ప్రమాణాలు, స్లాట్ బుకింగ్పై గ్రామస్థాయిలో విస్తృత అవగాహన కల్పించాలని తుమ్మల అన్నారు. రైతుల ఫిర్యాదుల పరిష్కారం కోసం 1800 599 5779 టోల్ఫ్రీ హెల్ప్లైన్, 88972 81111 వాట్సాప్ చాట్బాట్ సేవలను వినియోగించుకునేలా ప్రచారం చేయాలని సూచించారు. ప్రతి మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన ప్రత్యేక హెల్ప్డెస్క్లను సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. “రైతుకు ఎంఎస్పీ అందించడమే ప్రధాన లక్ష్యం. ఈ విషయంలో ఏ స్థాయిలోనైనా నిర్లక్ష్యం లేదా నిబంధనల ఉల్లంఘన జరిగితే తీవ్రంగా పరిగణిస్తాం. రైతుకు నష్టం కలిగించే చర్యలు, అవకతవకలు చోటుచేసుకుంటే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం” అని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీలు, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలు, సీసీఐ అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రతి పత్తి రైతుకు ఎంఎస్పీ ప్రయోజనం అందేలా చూడాలని ఆదేశించారు.

