భూభారతి పేరుతో భూదందా!
లక్షలాది ఎకరాలను 22ఏ జాబితాలో చేర్చారు
50 శాతం వాటాలు, భారీగా లంచాల డిమాండ్
రూ.15 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలి
సెప్టెంబర్ 17న హైదరాబాద్ విమోచన దినోత్సవం
కేంద్ర మంత్రి జి. కిషన్రెడ్డి
కాకతీయ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణలో భూదందాలు, సెటిల్మెంట్ల రాజ్యం నడుస్తోందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్రెడ్డి ఆరోపించారు. ‘భూభారతి’ పేరుతో ప్రైవేటు భూములను సైతం 22ఏ నిషేధిత జాబితాలో చేర్చి సెటిల్మెంట్లకు తెరతీశారని విమర్శించారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోనే సుమారు నాలుగు లక్షల ఎకరాల భూములను 22ఏలో చేర్చినట్లు ఆరోపిస్తూ.. గత రెండుమూడేళ్లలో నిషేధిత జాబితాలో చేర్చిన, తొలగించిన భూములపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో సమగ్ర న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. శనివారం హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. దశాబ్దాలుగా మున్సిపల్ అనుమతులు పొంది, పన్నులు చెల్లిస్తూ నివాసముంటున్న ప్రైవేటు ఇళ్లు, స్థలాలను సైతం 22ఏలో చేర్చి ఇబ్బందులకు గురిచేస్తున్నారని కిషన్రెడ్డి ఆరోపించారు. సెటిల్మెంట్ల పేరుతో 50 శాతం వాటాలు, భారీగా లంచాలు డిమాండ్ చేస్తున్నారన్నారు. ప్రభుత్వ, దేవాదాయ భూములకు మాత్రమే వర్తించాల్సిన 22ఏ జాబితాలో ప్రైవేటు ఆస్తులను చేర్చడంపై సమగ్ర విచారణ అవసరమన్నారు. హైడ్రా వ్యవహారంలోనూ పేదలకు ఒక న్యాయం, మజ్లిస్, కాంగ్రెస్ నేతలకు మరో న్యాయం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రజల ఆస్తులు భద్రంగా ఉండాలంటే ఆర్మీని దింపాల్సిన పరిస్థితి వచ్చిందంటూ హైకోర్టు వ్యాఖ్యానించిందని గుర్తుచేశారు. భూ బాధితులకు మండల స్థాయి నుంచి హైకోర్టు వరకు బీజేపీ లీగల్ సెల్ ద్వారా ఉచిత న్యాయ సహాయం అందిస్తామని తెలిపారు.
రేషన్ బియ్యంపై కేంద్ర లోగో ఏదీ?
ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన కింద కేంద్ర ప్రభుత్వం 70 శాతానికి పైగా సబ్సిడీ భరిస్తూ పేదలకు ఐదు కిలోల ఉచిత బియ్యం అందిస్తోందని కిషన్రెడ్డి తెలిపారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వ లోగోతో పంపిణీ జరుగుతుండగా.. తెలంగాణలో మాత్రం ప్రధాని నరేంద్ర మోదీ పేరు, భారత ప్రభుత్వ లోగో లేకుండా ముఖ్యమంత్రి, పౌరసరఫరాల మంత్రి ఫొటోలు మాత్రమే ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించారు. కేంద్రం అందిస్తున్న పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం తన పథకంగా ప్రచారం చేసుకోవడం మానుకోవాలని సూచించారు. లేకపోతే ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా లబ్ధిదారులకు బియ్యం అందించే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తుందని హెచ్చరించారు. రాష్ట్రంలో కాలేజీలకు చెల్లించాల్సిన సుమారు రూ.15 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిధులు లేక ఇంజనీరింగ్ కాలేజీలు మూతపడుతున్నాయని, విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు.
ఓటర్ల జాబితా శుద్ధి చట్టబద్ధ ప్రక్రియ
ఓటర్ల జాబితా శుద్ధి కేంద్ర ఎన్నికల సంఘం చేపడుతున్న చట్టబద్ధ ప్రక్రియ అని కిషన్రెడ్డి తెలిపారు. ‘ఒక వ్యక్తి.. ఒకే ఓటు’ విధానంలో భాగంగా డబుల్ ఓట్లు, మరణించిన వారి ఓట్లను తొలగిస్తున్నారని చెప్పారు. ఈ ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, బీఎల్వోలు పనిచేస్తున్నప్పటికీ కేంద్రంపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. హైదరాబాద్లో గ్రామీణ ఓట్లను తగ్గించి మజ్లిస్కు లబ్ధి చేకూర్చేందుకే సీఎం రేవంత్రెడ్డి ప్రజలను భయపెట్టారని ఆయన ఆరోపించారు. గ్రామంలో ఓటు నమోదు చేసుకోకపోతే రేషన్ కార్డులు, భూములు, ఆస్తులు, పెన్షన్లు పోతాయని సీఎం చేసిన ప్రకటనలతో ప్రజలు భయపడే పరిస్థితి ఏర్పడిందన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో 9.35 లక్షల ఓట్లు తగ్గాయని పేర్కొన్నారు.
విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తాం
రజాకార్ల అరాచకాలకు, నిజాం నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా కలంతో పోరాడిన ‘ఇమ్రోజ్’ పత్రిక ఎడిటర్ షోయబుల్లా ఖాన్ వర్ధంతి సందర్భంగా కిషన్రెడ్డి నివాళులర్పించారు. త్రివర్ణ పతాకం ఎగరాలని, అంబేడ్కర్ రాజ్యాంగం అమలు కావాలని కోరినందుకు రజాకార్లు ఆయనను 1948 ఆగస్టు 21న కాచిగూడ లింగంపల్లి చౌరస్తాలో హత్య చేశారని గుర్తుచేశారు. ఈ ఏడాది సెప్టెంబర్ 17న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ‘హైదరాబాద్ విమోచన దినోత్సవం’ నిర్వహించనున్నట్లు తెలిపారు. పారామిలిటరీ కవాతు, తెలంగాణ కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలతో వేడుకలు ఘనంగా నిర్వహిస్తామన్నారు. మహారాష్ట్ర, కర్ణాటకల్లో దశాబ్దాలుగా అధికారికంగా నిర్వహిస్తున్నప్పటికీ.. తెలంగాణలో గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు మజ్లిస్ భయంతో, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం నిర్వహించడం లేదని విమర్శించారు. విదేశీ పర్యటనల అనుమతుల విషయంలో రాజకీయ కక్షసాధింపులు లేవని, దౌత్య నిబంధనలు, భద్రతా ప్రోటోకాల్స్ ప్రకారమే కేంద్ర విదేశాంగ శాఖ నిర్ణయాలు తీసుకుంటుందని కిషన్రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ హయాంలోనూ బీజేపీ మంత్రుల విదేశీ పర్యటనలకు అనుమతులు రాని సందర్భాలున్నాయని తెలిపారు. 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో 369 మంది విద్యార్థులను కాల్చి చంపిన చరిత్ర కాంగ్రెస్దేనని విమర్శించారు. పార్లమెంట్ వద్ద ఆందోళనల విషయంలో రాహుల్గాంధీ బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నేతగా వ్యవహరించాలని సూచించారు.

