కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలు ఏమయ్యాయి..?100 రోజుల్లో చేస్తామన్నారు.. 1000 రోజులైనా అమలు చేయలేదు
కేసీఆర్పై నిందలు మాని ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకోండి
హామీలు అమలు చేయకుంటే ప్రజల తిరుగుబాటు తప్పదు
బీఆర్ఎస్ ములుగు జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీనరసింహారావు
ములుగు జిల్లా కేంద్రంలో శ్రేణులతో కలిసి భారీ నిరసన ప్రదర్శన
కాకతీయ, ములుగు ప్రతినిధి : కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా తెలంగాణ ప్రజలను మోసం చేస్తోందని బీఆర్ఎస్ ములుగు జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీనరసింహారావు మండిపడ్డారు. 100 రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పి.. 1000 రోజులు గడిచినా ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేదని విమర్శించారు. ఆరు గ్యారెంటీలు, అనేక ఉపహామీల పేరుతో ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఇప్పుడు హామీల అమలుపై సమాధానం చెప్పకుండా తప్పించుకుంటోందని ఆరోపించారు. ప్రజలను మోసం చేసి పాలించాలని చూస్తే క్షమించబోమని, హామీలను అమలు చేసే వరకు బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. కేటీఆర్ ఆదేశాల మేరకు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ బుధవారం ములుగు జిల్లా కేంద్రంలో 420 అడుగుల ఫ్లెక్సీతో భారీ ర్యాలీ నిర్వహించారు. ములుగు శివారులోని డీఎల్ఆర్ ఫంక్షన్ హాల్ నుంచి ప్రారంభమైన ర్యాలీ ప్రభుత్వ ఆసుపత్రి వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జి బడే నాగజ్యోతితో కలిసి లక్ష్మీనరసింహారావు పాల్గొన్నారు. అనంతరం ప్రధాన చౌరస్తాలో నిర్వహించిన నిరసనలో కాంగ్రెస్ ప్రభుత్వ హామీల అమలుపై ఆయన నిలదీశారు.

మహాలక్ష్మి హామీ ఏమైంది..?
మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు నెలకు రూ.2,500 ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని లక్ష్మీనరసింహారావు అన్నారు. రాష్ట్రంలో ఎంతమంది మహిళలకు ఆ మొత్తం అందుతోందో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళలకు తులం బంగారం, స్కూటీ ఇస్తామన్న హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఎన్నికల ముందు అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఇప్పుడు ప్రజలకు ఇచ్చిన మాటలను మరిచిపోయిందని విమర్శించారు. రైతులకు రైతుబంధు స్థానంలో రైతు భరోసా కింద ఎకరాకు రూ.15 వేలు ఇస్తామని చెప్పారని, వానాకాలం, యాసంగి సీజన్లు గడుస్తున్నా రైతుల ఖాతాల్లో ఆ సాయం పూర్తిస్థాయిలో పడటం లేదని ఆరోపించారు. కౌలు రైతులకు భరోసా ఇస్తామన్న హామీని కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. యువతకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నేటికీ ఆ హామీని నెరవేర్చలేదని, నిరుద్యోగ భృతి రూ.4 వేల హామీ ఏమైందో చెప్పాలని డిమాండ్ చేశారు. పేపర్ లీకేజీలతో నిరుద్యోగ యువత జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని మండిపడ్డారు.
కేసీఆర్పై నిందలు వేయడమే పనిగా పెట్టుకున్నారు
పాలన చేతకాక ప్రతి వైఫల్యానికి కేసీఆర్ను నిందించడం కాంగ్రెస్ ప్రభుత్వానికి అలవాటుగా మారిందని లక్ష్మీనరసింహారావు విమర్శించారు. కాళేశ్వరం కూలిందని, అప్పులు పెరిగాయని, ఉద్యోగాలు ఇవ్వలేదని చెబుతూ గత ప్రభుత్వంపై బురదజల్లడమే తప్ప.. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారో కాంగ్రెస్ చెప్పాలని ప్రశ్నించారు. మూడేళ్లకు చేరువైన పాలనలో సొంతంగా చెప్పుకోవడానికి ఒక్క విజయం లేకపోవడంతోనే కేసీఆర్పై నిందలు వేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రజలు అమాయకులు కారని, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని స్వయంగా చూసిన ప్రజలు కాంగ్రెస్ మాటలను నమ్మబోరని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన సమ్మక్క బ్యారేజీతో ములుగు ప్రాంతంలోని చెరువులు నిండాయని, మిషన్ భగీరథ ద్వారా గిరిజన గూడేల్లోకి నల్లా నీరు వచ్చిందని గుర్తుచేశారు. రైతుబంధు పథకం రైతులకు ఆత్మగౌరవాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు.
ప్రతి గడ్డపై గులాబీ తిరుగుబాటు
ములుగు గడ్డపై ప్రారంభమైన గులాబీ పోరాటం ఇక్కడితో ఆగదని లక్ష్మీనరసింహారావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా నిద్రమత్తులోనే ఉందని, ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే తెలంగాణలోని ప్రతి గడ్డపై, ప్రతి గ్రామంలో గులాబీ తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. హామీలతో గెలిచి.. మోసంతో పాలించాలని చూస్తే ప్రజలు క్షమించరని అన్నారు. ములుగు గడ్డపై ఎగిసిన గులాబీ జెండా తెలంగాణ ఆత్మగౌరవ పునరుద్ధరణకు నాంది అని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని బీఆర్ఎస్ ములుగు జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీనరసింహారావు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

