రవాణా శాఖలో ‘పెద్ద సారు’ పెత్తనం!
అధికారి విధులకు దూరంగా ఉన్నా.. ఆయన లాగిన్తో ధ్రువపత్రాల జారీ?
అధికారిక లాగిన్ను ఇతరులు వినియోగించారా?
నిబంధనలకు విరుద్ధంగా అధికారాల బదలాయింపు జరిగిందా?
అధికార దుర్వినియోగంపై ఉన్నతాధికారులు విచారణ చేయాల్సిందే!
కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో అధికార దుర్వినియోగం జరిగిందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా రవాణా అధికారి (డీటీఓ) కార్యాలయంలో అందుబాటులో లేని సమయంలోనూ ఆయన పేరుతో ధ్రువపత్రాలు జారీ అయినట్లు తెలుస్తుండటం ఈ సందేహాలకు కారణమవుతోంది. సెప్టెంబరు 2న డీటీఓ ఇతర శాఖాపరమైన పనుల నిమిత్తం కోర్టుకు హాజరైనట్లు సమాచారం. అదే సమయంలో కార్యాలయంలో ఆయన పేరుతో అధికారిక ప్రక్రియలు కొనసాగినట్లు తెలుస్తోంది. డీటీఓకు కేటాయించిన లాగిన్ వివరాలను ప్రైవేటు ఉద్యోగి వినియోగించారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. నిజంగా అదే జరిగితే.. అధికారికంగా తనకు కేటాయించిన అధికారాలను మరో వ్యక్తి ద్వారా వినియోగించేందుకు అధికారి అనుమతించారా? లేక ఎలాంటి అధికారిక ఆదేశాలు లేకుండానే లాగిన్ వినియోగించారా? అనే అంశాలు ఇప్పుడు కీలకంగా మారాయి.
డీటీఓ విధులకు హాజరు కాకుండా కోర్టుకు వెళ్లిన రోజే ఆయన పేరుతో ధ్రువపత్రాలు జారీ కావడం సాధారణ పరిపాలనా ప్రక్రియ కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అధికారి గైర్హాజరైనప్పుడు ఆయన స్థానంలో విధులు నిర్వహించేందుకు అధికారికంగా మరో అధికారిని నియమించారా? లేక డీటీఓకు ఉన్న అధికారాలను కార్యాలయంలోని ఇతరులు వినియోగించారా? అన్నది తేలాల్సి ఉంది. ముఖ్యంగా అధికారి వ్యక్తిగత లాగిన్ ద్వారా జరిగే వ్యవహారాలను మరొకరు నిర్వహించి ఉంటే.. అది కేవలం కార్యాలయ విధానాల ఉల్లంఘనకే పరిమితమవుతుందా? లేక అధికార దుర్వినియోగం కిందకు వస్తుందా? అన్నది ఉన్నతాధికారుల విచారణలో తేలాల్సి ఉంటుంది.

ప్రైవేటు వ్యక్తికి అధికారిక లాగిన్ ఎలా?
రవాణా శాఖలో డీటీఓ లాగిన్ సాధారణ ఉద్యోగి ఉపయోగించే యూజర్ ఐడీ కాదని, దాని ద్వారా కీలకమైన అధికారిక ప్రక్రియలు జరుగుతాయని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. అలాంటి లాగిన్ వివరాలు ప్రైవేటు ఉద్యోగికి చేరాయన్న ఆరోపణలు నిజమైతే.. అధికారిక వ్యవస్థలోకి అనధికార వ్యక్తి ప్రవేశించినట్టేనన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అధికారి తన లాగిన్ వివరాలను ఇతరులకు అందించి ఉంటే దాని వెనుక ఉద్దేశం ఏమిటి? ఎవరి ఆదేశాలతో ఆ వ్యక్తి అధికారిక కార్యకలాపాలు నిర్వహించారు? ఎలాంటి పర్యవేక్షణ లేకుండా ధ్రువపత్రాలు జారీ చేసే అవకాశం కల్పించారా? అనే అంశాలను పరిశీలించాల్సిన అవసరం ఉంది. లాగిన్ ద్వారా జరిగిన ప్రతి లావాదేవీకి సంబంధించిన డిజిటల్ వివరాలను పరిశీలిస్తే ఎవరు, ఎప్పుడు, ఏ ప్రక్రియ నిర్వహించారన్నది స్పష్టమయ్యే అవకాశం ఉంది.
ఇన్చార్జి లేకుండా అధికారాల వినియోగమా?
ఒక జిల్లా స్థాయి అధికారి విధులకు అందుబాటులో లేని సమయంలో ఆయన బాధ్యతలను మరో అర్హత కలిగిన అధికారికి అధికారికంగా అప్పగించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ధ్రువపత్రాల జారీ వంటి అధికారిక నిర్ణయాలు వ్యక్తిగత లాగిన్ల ఆధారంగా కాకుండా నిబంధనల ప్రకారం కొనసాగాల్సి ఉంటుంది. సెప్టెంబరు 2న డీటీఓ గైర్హాజరైన సమయంలో ఇలాంటి అధికారిక బాధ్యతల బదలాయింపు జరిగిందా? జరిగితే ఎవరికీ అప్పగించారు? అందుకు సంబంధించిన ఉత్తర్వులు ఉన్నాయా? అన్న వివరాలు బయటకు రావాల్సి ఉంది. ఎలాంటి ఇన్చార్జి ఉత్తర్వులు లేకుండానే డీటీఓ లాగిన్ను మరొకరు ఉపయోగించి ఉంటే.. ఆ వ్యవహారంపై శాఖాపరమైన చర్యలు తీసుకునే అంశాన్ని కూడా అధికారులు పరిశీలించాల్సి ఉంటుంది.
‘షాడో’ అధికారి వ్యవహారంపై విచారణ
ములుగు రవాణా శాఖ కార్యాలయంలో కొందరు ప్రైవేటు వ్యక్తుల జోక్యం పెరిగిందన్న ఆరోపణలు గతంలోనూ వినిపించిన నేపథ్యంలో తాజా పరిణామాలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ప్రభుత్వ అధికారాలు కలిగిన ప్రక్రియల్లో ప్రైవేటు వ్యక్తులు జోక్యం చేసుకునే పరిస్థితి ఉంటే.. అది పరిపాలనా వ్యవస్థకు తీవ్ర విఘాతం కలిగించే అంశంగా మారుతుంది. అధికారి కార్యాలయంలో లేని సమయంలో ఆయన పేరుతో ధ్రువపత్రాలు జారీ కావడం, అదే సమయంలో లాగిన్ వివరాలు ప్రైవేటు వ్యక్తికి చేరాయన్న ఆరోపణలు రావడం వెనుక అసలు వ్యవహారం ఏమిటో తేల్చాల్సిన బాధ్యత ఉన్నతాధికారులపై ఉంది. డీటీఓ లాగిన్ వివరాలను ఎవరు వినియోగించారు? ఏ సమయంలో ఎన్ని ధ్రువపత్రాలు జారీ చేశారు? ఆ ప్రక్రియలను ఎవరు ఆమోదించారు? అధికారి గైర్హాజరైన సమయంలో అధికారికంగా ఇన్చార్జి ఎవరైనా ఉన్నారా? లాగిన్ వివరాలను ప్రైవేటు వ్యక్తికి అందించినట్లయితే అందుకు అధికారి అనుమతి ఉందా? అనే అంశాలపై సమగ్ర విచారణ జరపాలని జిల్లా వాసులు కోరుతున్నారు. ముఖ్యంగా డిజిటల్ లాగిన్ చరిత్ర, ధ్రువపత్రాల జారీ వివరాలు, కార్యాలయ హాజరు రికార్డులు, ఇన్చార్జి బాధ్యతలకు సంబంధించిన ఉత్తర్వులను పరిశీలించాలని వారు కోరుతున్నారు. అధికారిక అధికారాలను అనధికార వ్యక్తుల ద్వారా వినియోగించినట్లు తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

