19 రకాల గోదావరి రుచులతో అన్నసమారాధన
కాకతీయ, కూకట్పల్లి: వినాయకచవితి సందర్భంగా హైదరాబాద్ కేపీహెచ్బీ ఆదిత్యనగర్ పార్కు వద్ద వుయ్యూరు జగదీష్ ఆధ్వర్యంలో అఖండ అన్నసమారాధన నిర్వహించారు. ఏలూరు జిల్లా కామవరపుకోటకు చెందిన జగదీష్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా నిర్వహించే అన్నసమారాధనను ఈసారి 19 రకాల ఆంధ్రా గోదావరి రుచులతో ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. నూజివీడుకు చెందిన ప్రముఖ వంటమేస్త్రీ పుల్లయ్య బృందం ఆధ్వర్యంలో వంటలు తయారు చేసి 1500 మందికి పైగా భక్తులకు బంతిభోజనం పెట్టారు. చాలా రోజుల తర్వాత 19 రకాల వంటకాలతో గోదావరి రుచుల్లో అన్నసమారాధన నిర్వహించడం ఆనందంగా ఉందని భక్తులు ప్రశంసించారు. అన్నవరం ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో దండోరా సినిమా నిర్మాత బెన్నీతో పాటు పలువురు సినీ, సీరియల్ ఆర్టిస్టులు పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన లడ్డూ వేలంలో తొలి లడ్డూను నీలేష్ చోప్రా–లక్ష్మీస్పందన దంపతులు రూ.61 వేలకు, రెండో లడ్డూను మందలపు హనుమంతు రూ.47 వేలకు, మూడో లడ్డూను లోహిత్చారి రూ.20 వేలకు సొంతం చేసుకున్నారు.

