అక్రమ ఇసుక రవాణాపై పోలీసుల ఉక్కుపాదం
మూడు ట్రాక్టర్ల స్వాధీనం.. నిందితుల అరెస్ట్
అక్రమ రవాణాకు పాల్పడితే సస్పెక్ట్ షీట్లు తప్పవు
కరీంనగర్ రూరల్ సీఐ ఏ నిరంజన్ రెడ్డి హెచ్చరిక
కాకతీయ, కరీంనగర్ రూరల్ : జిల్లాలో అక్రమ ఇసుక రవాణాపై కరీంనగర్ రూరల్ పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను బుధవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గ్రామాల్లో సాధారణ పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో ఈ అక్రమ రవాణా ఉదంతాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసుల కథనం ప్రకారం.. సుల్తానాబాద్ మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన పెందం జంపన్న తన ట్రాక్టర్లో అక్రమంగా ఇసుకను లోడ్ చేసి కరీంనగర్ వైపు తరలిస్తుండగా, బొమ్మకల్ ఫ్లైఓవర్ వద్ద పోలీసులు మాటు వేసి పట్టుకున్నారు. అదేవిధంగా మానకొండూరు మండలం రాఘవపూర్ గ్రామానికి చెందిన దావూ రాజు మానేరు వాగు నుంచి ఇసుకను దొంగతనంగా తరలిస్తుండగా బొమ్మకల్ సమీపంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కేసులు నమోదు.. కోర్టుకు తరలింపు
ఈ రెండు ఘటనల్లో పట్టుబడిన మూడు ట్రాక్టర్లను పోలీసులు సీజ్ చేశారు. నిందితులపై సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, వారిని కోర్టుకు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. అక్రమ రవాణా ద్వారా ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే వారిపై నిరంతరం నిఘా ఉంటుందని స్పష్టం చేశారు. అక్రమ ఇసుక రవాణాకు పాల్పడే వారిపై కరీంనగర్ రూరల్ సీఐ ఏ నిరంజన్ రెడ్డి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఎవరైనా చట్టవిరుద్ధంగా ఇసుక తరలిస్తే వారిని తహసీల్దార్ ముందు బైండోవర్ చేస్తామని తెలిపారు. పదేపదే ఇవే చర్యలకు పాల్పడే వారిపై సస్పెక్ట్ షీట్లు తెరుస్తామని, చట్టపరంగా కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ప్రకృతి వనరులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, అక్రమార్కుల సమాచారాన్ని పోలీసులకు అందించాలని కోరారు.

