పార్టీ బలం కార్యకర్తలే
బీఆర్ఎస్ పార్టీ బలోపేతమే లక్ష్యం
త్వరలోనే పరకాల పట్టణ .. వార్డుల వారీగా కమిటీలు
పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
కాకతీయ, పరకాల : రానున్న రోజులలో బీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు ముందుకు సాగాలని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పిలుపునిచ్చారు. పరకాల పట్టణంలోని లలిత మినీ కన్వెన్షన్ హాల్లో కార్యకర్తలతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వార్డుల వారీగా పార్టీ పరిస్థితులు మరియు కార్యకలాపాలపై ఆయన సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ పార్టీకి అసలైన బలం కార్యకర్తలేనని కొనియాడారు. ప్రతి ఒక్కరూ నిరంతరం ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. పార్టీకి ప్రజల్లో ఉన్న ఆదరణను మరింత పెంచే బాధ్యతను అందరూ భుజాన వేసుకోవాలన్నారు. వార్డు స్థాయిలో పార్టీ నిర్మాణం బలంగా ఉంటేనే పట్టణ స్థాయిలో విజయాలు సాధ్యమవుతాయని పేర్కొన్నారు. త్వరలోనే వార్డుల వారీగా నూతన కమిటీలను ఏర్పాటు చేస్తామని, ప్రతి కార్యకర్తకు సముచిత బాధ్యతలు అప్పగిస్తామని వెల్లడించారు.
కాంగ్రెస్ మాయమాటలు నమ్మి మోసపోయారు
జగిత్యాలలో నిర్వహించిన కేసీఆర్ సభతో పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం వచ్చిందని చల్లా ధర్మారెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ మాయమాటలు నమ్మి మోసపోయామని ఇప్పటికే గ్రహించారని వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు తగిన సమాధానం చెబుతారని, మళ్లీ కేసీఆర్ను ముఖ్యమంత్రిగా చూడాలని రాష్ట్ర ప్రజలు నిర్ణయించుకున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ పరకాల మున్సిపాలిటీ కౌన్సిలర్లు, పార్టీ ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

