మట్టి మాఫియాపై ‘రెవెన్యూ’ పంజా!
కూసుమంచిలో అక్రమ తవ్వకాలపై అధికారుల మెరుపు దాడులు
8 ట్రాక్టర్లు, ఒక జేసీబీ స్వాధీనం.. స్టేషన్కు తరలింపు
దాడులు కొనసాగాలని కోరుతున్న మండల ప్రజలు
కాకతీయ, కూసుమంచి: కూసుమంచి మండలంలో ఇన్నాళ్లూ యథేచ్ఛగా సాగిన మట్టి మాఫియా ఆగడాలకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. పగలు, రాత్రి అనే తేడా లేకుండా ప్రకృతి సంపదను కొల్లగొడుతున్న అక్రమార్కులపై రెవెన్యూ మరియు పోలీసు యంత్రాంగం ఉమ్మడిగా విరుచుకుపడింది. గురువారం మండలంలోని గురువాయిగూడెంలో అక్రమంగా మట్టి తవ్వుతున్నారన్న సమాచారంతో రెవెన్యూ అధికారులు, ఎస్ఐ నాగరాజు ఆధ్వర్యంలో పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో మట్టిని తరలిస్తున్న 8 ట్రాక్టర్లతో పాటు తవ్వకాలకు ఉపయోగిస్తున్న ఒక జేసీబీని స్వాధీనం చేసుకుని పోలీసు స్టేషన్కు తరలించారు.
అడ్డు అదుపు లేని ధనదాహం!
గత కొంతకాలంగా కూసుమంచి మండలంలోని వివిధ గ్రామాల్లో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. ఎక్కడ మట్టి గుట్టలు కనిపించినా, చెరువుల్లో అవకాశమున్నా వాలిపోతూ పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగిస్తున్నారు. స్థానికుల నుంచి ఎన్ని ఫిర్యాదులు వెళ్లినా గతంలో సంబంధిత అధికారులు ‘చీమ కుట్టినట్లు’ కూడా వ్యవహరించేవారు కాదని విమర్శలు ఉన్నాయి. మట్టి మాఫియా అక్రమ దందాకు రెవెన్యూ, ఇరిగేషన్, మైనింగ్ విభాగాల్లోని కొందరు అధికారుల అండదండలు పుష్కలంగా ఉన్నాయనే ఆరోపణలు ఎప్పటి నుంచో వెల్లువెత్తుతున్నాయి. అధికారులకు ఫిర్యాదు అందగానే, ఆ సమాచారం ముందే మాఫియాకు చేరడం వల్ల వారు తప్పించుకునేవారని సమాచారం.
ప్రజల హర్షం.. చర్యలు కొనసాగేనా?
చాలా కాలం తర్వాత అధికారులు స్పందించి వాహనాలను స్వాధీనం చేసుకోవడంతో మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఇవి కేవలం ‘ఉత్తి’ దాడులతోనే సరిపెడతారా లేక అక్రమార్కులపై కఠినమైన జరిమానాలు విధిస్తారా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కేవలం వాహనాలను పట్టుకోవడం మాత్రమే కాకుండా, ఈ అక్రమ రవాణా వెనుక ఉన్న సూత్రధారులపై కూడా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇకనైనా కూసుమంచి మండలంలో ప్రకృతి సంపద దోపిడీకి అడ్డుకట్ట పడుతుందో లేదో వేచి చూడాలి.

