ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను నెరవేర్చాలి
జేఏసీ ఆధ్వర్యంలో అమరవీరుల స్తూపం వరకు శాంతి ర్యాలీ
శంకర్ గౌడ్ మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి
కార్మికులకు సంఘీభావం తెలిపిన మేయర్ కొలగాని శ్రీనివాస్
కాకతీయ, కరీంనగర్ : ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శుక్రవారం కరీంనగర్ ఆర్టీసీ డిపో వద్ద నిరసన తెలుపుతున్న ఆర్టీసీ జేఏసీ కార్మికులకు ఆయన ప్రత్యక్షంగా కలిసి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా బస్టాండ్ నుంచి అమరవీరుల స్తూపం వరకు నిర్వహించిన శాంతి ర్యాలీలో మేయర్ పాల్గొని కార్మికులకు మద్దతుగా నిలిచారు. నర్సంపేట డిపోకు చెందిన డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి చెందడం అత్యంత బాధాకరమని, దీనికి ప్రభుత్వమే నైతిక బాధ్యత వహించాలని మేయర్ అన్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరి వల్లే కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితులు వస్తున్నాయని విమర్శించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి, కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, బకాయి ఉన్న వేతన సవరణలను (పీఆర్సీ) వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
చర్చలకు పిలవాలి..
ఆర్టీసీని బలోపేతం చేసేందుకు కొత్త బస్సులను కొనుగోలు చేయాలని, అద్దె బస్సుల వల్ల కార్మికులకు జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టాలని సూచించారు. జేఏసీ ప్రతిపాదించిన 32 డిమాండ్లపై ప్రభుత్వం మొండి వైఖరి వీడి, సమ్మెలో ఉన్న 39 వేల మంది కార్మికులతో తక్షణమే చర్చలు జరపాలన్నారు. సంస్థలో కొత్త నియామకాలు చేపట్టి నిరుద్యోగులకు అవకాశం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు చంద్ర, దేవసాని సరస్వతి, మాసం గణేష్, తోట అనిల్, ఆర్టీసీ యూనియన్ నాయకులు మరియు కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

