పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య
ఫెయిల్ అవుతానేమోనన్న ఆందోళనతో బలవన్మరణం
మెదక్ జిల్లా కొత్తపల్లి తండాలో విషాదం
కాకతీయ, మెదక్ : పదో తరగతి ఫలితాల్లో ఫెయిల్ అవుతానేమోనన్న భయం ఓ విద్యార్థిని నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఈ విషాదకర ఘటన మెదక్ జిల్లాలోని కొత్తపల్లి తండాలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. తండాకు చెందిన బానోత్ సాయిప్రియ (16) స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. ఇటీవల జరిగిన పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు ఆమె హాజరైంది. అయితే, పరీక్షలు సరిగ్గా రాయలేదనో లేక ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించలేనన్న ఆందోళనతో సాయిప్రియ గత కొన్ని రోజులుగా మనస్తాపానికి గురైంది. ఈ క్రమంలోనే ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. చేతికి అందొచ్చిన కూతురు కళ్లముందే విగతజీవిగా పడి ఉండటంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటన తండాలో విషాద ఛాయలు నింపింది.

