లింగ సమానత్వంతోనే సమాజ అభివృద్ధి
బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
షీ టీమ్స్ అవగాహన సదస్సులో డీఎస్పీ కిషోర్ కుమార్
కాకతీయ, ములుగు ప్రతినిధి : సమాజ అభివృద్ధిలో లింగ సమానత్వం అత్యంత కీలకమని, మహిళలు, పురుషులు సమాన హక్కులు పొందినప్పుడే అది సాధ్యమవుతుందని ములుగు జిల్లా షీ టీమ్స్ ఇన్ఛార్జ్ డీఎస్పీ కిషోర్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం ములుగు ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో మహిళల రక్షణ, బాల్య వివాహాల నిర్మూలనపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ’99 రోజుల ప్రత్యేక కార్యాచరణ’లో భాగంగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. పని ప్రదేశాల్లో గానీ, బహిరంగ ప్రదేశాల్లో గానీ వేధింపులకు గురయ్యే మహిళలు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని కోరారు. బాధితులు డయల్ 100 లేదా షీ టీమ్స్ వాట్సాప్ నంబర్ 8712576528 కు సమాచారం అందించవచ్చని, ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. అలాగే సోషల్ మీడియా మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, సైబర్ క్రైమ్ బాధితులు వెంటనే 1930 కి ఫిర్యాదు చేయాలని సూచించారు. బాల్య వివాహాలు పిల్లల భవిష్యత్తును చిన్నాభిన్నం చేస్తాయని, ఇవి ఆరోగ్య సమస్యలతో పాటు విద్యావకాశాలను దెబ్బతీస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. 18 ఏళ్ల లోపు బాలికలకు వివాహాలు చేయడం చట్టరీత్యా నేరమని, ఇలాంటి ఘటనలు ఎక్కడ జరిగినా వెంటనే 1098 హెల్ప్లైన్కు సమాచారం ఇవ్వాలని పౌరులను కోరారు. బాలికలకు సరైన విద్య, భద్రత కల్పించినప్పుడే సమాజంలో సమానత్వం సాధ్యమవుతుందని చెప్పారు. కార్యక్రమంలో షీ టీమ్స్ ఇన్స్పెక్టర్ బండారి కుమార్, ఎస్ఐ మౌనిక, సిబ్బంది మొగిలి, చైతన్య, నవ్య తదితరులు పాల్గొన్నారు.

