డంపింగ్ యార్డుతో నగర ప్రజల నరకయాతన
పొగతో ప్రజలు అనారోగ్యం పాలవుతున్నా పట్టదా..?
టెండర్లు తెరవడానికి చేతులకు రోగం పుట్టిందా?
అధికారుల తీరుపై మాజీ మేయర్ రవీందర్ సింగ్ ధ్వజం
ప్రశ్నిస్తే కార్పొరేటర్లపై కేసులు పెడుతున్నారంటూ ఆరోపణలు
కాకతీయ, కరీంనగర్: కరీంనగర్ నగరంలోని డంపింగ్ యార్డ్ సమస్యతో ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారని, అధికారుల నిర్లక్ష్యం వల్ల నగరం కాలుష్య కోరల్లో చిక్కుకుందని మాజీ మేయర్, 58వ డివిజన్ కార్పొరేటర్ సర్ధార్ రవీందర్ సింగ్ మండిపడ్డారు. శనివారం బీఆర్ఎస్ నాయకులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మున్సిపల్ పాలనపై తీవ్ర విమర్శలు గుప్పించారు. డంపింగ్ యార్డ్ నుంచి ఎగసిపడుతున్న పొగ, మంటలు, దుర్వాసనతో ప్రజలు రాత్రింబవళ్లు ఇబ్బందులు పడుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
టెండర్లలో ‘పే మిషన్’ ఏది?
చెత్త వేరు చేయడం, తరలింపు ప్రక్రియ కోసం 15వ ఫైనాన్స్ కమిషన్ నిధుల నుంచి రూ. 2 కోట్లు మంజూరైనప్పటికీ, ఇప్పటి వరకు టెండర్లు ఎందుకు ఓపెన్ చేయలేదని రవీందర్ సింగ్ ప్రశ్నించారు. “టెండర్లు తెరవడానికి అధికారుల చేతులకు రోగం పుట్టిందా?” అంటూ ఘాటుగా విమర్శించారు. టెండర్ల ఆలస్యానికి ‘పే మిషన్’ కుదరకపోవడమే కారణమని ఆరోపించారు. గతంలో బ్లాక్ లిస్టులో ఉన్న కాంట్రాక్టర్లకే మళ్లీ పనులు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని, చేయని పనులకు కూడా బిల్లులు మలచుకోవడంలోనే అధికారులు నిమగ్నమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేసులతో భయపెడతారా?
ప్రజల సమస్యలపై ప్రశ్నిస్తున్న కార్పొరేటర్లపై కేసులు పెట్టడం, అరెస్టులు చేయించడం దారుణమని రవీందర్ సింగ్ అన్నారు. ప్రజాప్రతినిధులు గళమెత్తితే అణచివేతకు పాల్పడుతున్నారని, అదే సమయంలో అధికారులను దుర్భాషలాడిన కాంట్రాక్టర్లపై మాత్రం చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. మున్సిపల్ అధికారుల అవినీతిపై తాను ఫిర్యాదు చేసి రెండేళ్లు గడిచినా ఇంతవరకు విచారణ జరగలేదని ఆరోపించారు. అవినీతి చేసిన అధికారుల జాబితా తన వద్ద ఉందని, అవసరమైతే కోర్టును ఆశ్రయిస్తానని హెచ్చరించారు.
ఉద్యమం తప్పదు..
కేంద్ర, రాష్ట్ర మంత్రులు సందర్శించినా డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కారం కాకపోవడం విచారకరమన్నారు. కలెక్టర్, కమిషనర్ వెంటనే స్పందించి టెండర్ ప్రక్రియను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో స్థానిక ప్రజలతో కలిసి భారీ స్థాయిలో ప్రజా ఉద్యమం చేపడతామని స్పష్టం చేశారు. అధికారులు అవినీతికి పాల్పడలేదని నమ్మకం ఉంటే.. మహాశక్తి ఆలయంలో ప్రమాణం చేసేందుకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. రాష్ట్రవ్యాప్తంగా కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఏకమై అధికారుల అక్రమాలను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.

