పేదల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట
గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
దుమ్ముగూడెంలో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాల
స్టేడియం నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించాం
త్వరలో ఇందిరమ్మ ఇండ్ల రెండో విడత ప్రారంభం
రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
కాకతీయ, కొత్తగూడెం : పేదల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, వారిని అన్ని రకాలుగా ఆదుకోవడానికి కట్టుబడి ఉందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నియోజకవర్గంలోని దుమ్ముగూడెం మండలంలో ఆయన విస్తృతంగా పర్యటించారు. గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి ఫలాలు ప్రతి కుటుంబానికి చేరేలా ప్రభుత్వం పనిచేస్తోందని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. మండలంలోని బండిరేవు గ్రామంలో ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల’ భవన నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గ్రామీణ విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఆధునిక తరగతి గదులు, సైన్స్, కంప్యూటర్ ల్యాబ్లు, హాస్టల్ వసతులతో నిర్మించనున్న ఈ పాఠశాల ద్వారా విద్యార్థులకు విద్యతో పాటు వసతి, పోషకాహారం, క్రీడలు, నైపుణ్యాభివృద్ధి వంటి సౌకర్యాలు ఒకే ప్రాంగణంలో అందుబాటులోకి వస్తాయని తెలిపారు.

రహదారుల అభివృద్ధి.. క్రీడలకు ప్రోత్సాహం
చింతగుప్ప గ్రామం నుండి బురదమడుగు వరకు బీటీ రహదారి నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలను మెరుగుపరచడం ద్వారా విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు గణనీయమైన ఉపయోగం ఉంటుందని పేర్కొన్నారు. అనంతరం ములకపాడు గ్రామంలోని మినీ స్టేడియంలో 400 మీటర్ల అథ్లెటిక్ ట్రాక్తో కూడిన మినీ ఇండోర్ స్టేడియం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా స్టేడియంలోని సదుపాయాలను జిల్లా కలెక్టర్ అంకిత్తో కలిసి పరిశీలించారు. అనంతరం బ్యాడ్మింటన్ కోర్టులో మంత్రి, కలెక్టర్ కలిసి షటిల్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు.
వారం రోజుల్లోనే రైతులకు నగదు
మారుమూల గిరిజన ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు కూడా అభివృద్ధి ఫలాలు చేరేలా ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని మంత్రి పొంగులేటి తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా పేదలకు గృహ సౌకర్యాలు కల్పిస్తున్నామని, మొదటి విడత విజయవంతంగా పూర్తయిందని, రెండో విడతను త్వరలో ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. రైతుల సంక్షేమంపై మాట్లాడుతూ, ధాన్యం మరియు మొక్కజొన్న కొనుగోళ్లను పారదర్శకంగా నిర్వహిస్తూ వారం రోజుల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని తెలిపారు.
అభివృద్ధికి బాటలు : కలెక్టర్, ఎమ్మెల్యే
భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ, దుమ్ముగూడెం మండలంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు స్థానిక ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా నిలుస్తాయని తెలిపారు. జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ, యంగ్ ఇండియా పాఠశాల నిర్మాణం ద్వారా జిల్లాలో విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు రానున్నాయన్నారు. ఈ పాఠశాలలో సుమారు 2,500 మంది విద్యార్థులు ఒకేచోట విద్యనభ్యసించే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమాలలో ఎస్పి రోహిత్ రాజు, ఐటీడీఏ పీవో రాహుల్, సబ్ కలెక్టర్ మృణల్ శ్రేష్ఠ తదితరులు పాల్గొన్నారు.

