ప్రమాద బాధితుడికి అండగా డీసీహెచ్ఎస్
క్షతగాత్రుడికి ప్రథమ చికిత్స చేసిన డాక్టర్ రాజశేఖర్ గౌడ్
కాకతీయ, తిరుమలాయపాలెం: ఆపదలో ఉన్న బాధితుడిని చూసి ఖమ్మం జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి డాక్టర్ కేసగాని రాజశేఖర్ గౌడ్ తన మానవత్వాన్ని చాటుకున్నారు. ప్రజాదర్బార్ కార్యక్రమానికి వెళ్తుండగా మార్గమధ్యంలో జరిగిన రోడ్డు ప్రమాదాన్ని గమనించి, తక్షణమే స్పందించి బాధితుడికి ప్రాథమిక చికిత్స అందించి ఆసుపత్రికి తరలించారు. తిరుమలాయపాలెం మండల కేంద్రం సమీపంలో ఆవుల ప్రవీణ్ అనే యువకుడు రోడ్డు ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడ్డాడు. విశేషమేమిటంటే, ప్రవీణ్కు సోమవారం వివాహం జరగాల్సి ఉంది. పెళ్లి పనుల్లో ఉండి ప్రమాదానికి గురైన ఆ యువకుడిని గమనించిన డాక్టర్ రాజశేఖర్ గౌడ్, వెంటనే తన వాహనాన్ని నిలిపివేశారు. రక్తస్రావంతో బాధపడుతున్న యువకుడికి ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్వయంగా ప్రథమ చికిత్స అందించారు. అనంతరం యువకుడిని తిరుమలాయపాలెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స అందేలా చర్యలు తీసుకున్నారు. జిల్లా స్థాయి అధికారిగా విధుల్లో ఉంటూనే, ఒక వైద్యుడిగా తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించిన రాజశేఖర్ గౌడ్ను స్థానికులు కొనియాడారు. గతంలోనూ పలు సందర్భాల్లో ఆయన సామాజిక సేవలో ముందుంటూ పేద ప్రజలకు అండగా నిలిచారని గ్రామస్థులు గుర్తు చేసుకున్నారు. సమయానికి వైద్యం అందడంతో యువకుడు ప్రాణాపాయం నుంచి తప్పించుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

