మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ ధ్యేయం
ప్రజలకు చేరువగా నాణ్యమైన వైద్య సేవలు
వరంగల్ లోక్ సభ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య
వడ్డేపల్లిలో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రారంభం
రూ. 4.61 కోట్లతో అభివృద్ధి పనులకు భూమిపూజ
బల్దియా నిధులతో కాలనీల్లో సీసీ రోడ్ల నిర్మాణం
కాకతీయ, వరంగల్ : నగర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని వరంగల్ లోక్ సభ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య, పశ్చిమ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి, నగర మేయర్ గుండు సుధారాణి పేర్కొన్నారు. ఆదివారం బల్దియా పరిధిలోని 60వ డివిజన్ వడ్డేపల్లిలో పలు అభివృద్ధి పనులకు వారు శ్రీకారం చుట్టారు. వైద్య సేవలు చేరువగా 15వ ఆర్థిక సంఘం హెల్త్ గ్రాంట్స్ నిధులు 143 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్) వారు ఘనంగా ప్రారంభించారు.
వైద్యం చేరువ
స్థానిక ప్రజలకు తక్షణ వైద్య సేవలు అందించడంలో ఈ కేంద్రం కీలకం కానుందని వారు తెలిపారు. వడ్డేపల్లి ప్రాంత వాసులకు ఈ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ద్వారా నాణ్యమైన చికిత్స అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. అనంతరం డివిజన్ లోని వివిధ ప్రాంతాల్లో సుమారు 4 కోట్ల 61 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులకు భూమిపూజ నిర్వహించారు. మౌలిక సదుపాయాల మెరుగుదలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు ప్రజాప్రతినిధులు వివరించారు. ఎస్ బీ హెచ్ కాలనీలో బల్దియా జనరల్ ఫండ్ నిధులు 163 లక్షలు, టీచర్స్ కాలనీ ఫేజ్-1లో బల్దియా జనరల్ ఫండ్ నిధులు 168 లక్షలు, దాస్యం ప్రణయ్ భాస్కర్ రోడ్ లో స్టాంప్ డ్యూటీ నిధులు 130 లక్షలతో పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ దాస్యం అభినవ్ భాస్కర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ అప్పయ్య, మున్సిపల్ అధికారులు మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

