కరీంనగర్లో ఆగని రణరంగం
బీజేపీ కార్యాలయం ముట్టడికి బీఆర్ఎస్ యత్నం.. ముదురుతున్న ఉద్రిక్తత!
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడికి ప్రతిచర్య
వందలాదిగా బీజేపీ ఆఫీస్ వైపు తరలుతున్న బీఆర్ఎస్ శ్రేణులు
పరస్పర దాడులతో రణరంగంగా మారిన కరీంనగర్
రెండు పార్టీల కార్యకర్తల మధ్య బాహాబాహీ
ఎక్కడికక్కడ అడ్డుకుంటున్న పోలీసులు
ప్రధాన కూడళ్లలో లాఠీచార్జ్, భారీగా అరెస్టులు.
బీజేపీ కార్యాలయంపై దాడికి బీఆర్ ఎస్ యత్నం
పార్టీ కార్యాలయం వైపు వందలాదిగా తరులుతున్న కార్యకర్తలు
రెండు పార్టీల పరస్పర దాడులతో కరీంనగర్లో హై వోల్టేజీ pic.twitter.com/xYDqMNl75i
— Kiran Arelly (@ArellyKiran1988) May 7, 2026
కాకతీయ, కరీంనగర్: కరీంనగర్లో రాజకీయ యుద్ధం మునుపెన్నడూ లేని విధంగా ముదురుతోంది. గురువారం ఉదయం ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయంపై దాడి, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడికి బీజేపీ నాయకులు యత్నించడానికి నిరసనగా, బీఆర్ఎస్ కార్యకర్తలు ఇప్పుడు ప్రతిదాడికి సిద్ధమయ్యారు. వందలాదిగా తరలివచ్చిన గులాబీ శ్రేణులు బీజేపీ జిల్లా కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించడంతో నగరం హై వోల్టేజీ ఉద్రిక్తతతో అట్టుడుకుతోంది. ఇరు పార్టీల కార్యకర్తలు రాళ్లు, కర్రలతో పరస్పరం దాడులకు దిగడంతో కరీంనగర్ ప్రధాన వీధులు యుద్ధ క్షేత్రాన్ని తలపిస్తున్నాయి.
బీజేపీ ఆఫీస్ దిశగా బీఆర్ఎస్ సైన్యం.. పోలీసుల ఉక్కుపాదం!
తన క్యాంపు కార్యాలయాన్ని ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పిలుపు మేరకు బీఆర్ఎస్ కార్యకర్తలు భారీ సంఖ్యలో కరీంనగర్ బీజేపీ కార్యాలయం వైపు దూసుకువెళ్లే ప్రయత్నం చేశారు. “బండి సంజయ్ డౌన్ డౌన్” అంటూ నినాదాలు చేస్తూ బారికేడ్లను దాటేందుకు ప్రయత్నించిన కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర తోపులాట జరగడంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు ఎక్కడికక్కడ బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు.
నగరంలో అప్రకటిత కర్ఫ్యూ.. గస్తీలో ఉన్నతాధికారులు!
బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య సాగుతున్న ఈ దాడుల పరంపరతో కరీంనగర్ వ్యాపార సముదాయాలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. ఉద్రిక్తతలు మరింత పెరగకుండా ఉండేందుకు సీపీ గౌస్ ఆలం ఆధ్వర్యంలో అదనపు బలగాలను రంగంలోకి దించారు. నగరంలోని ప్రధాన చౌరస్తాల వద్ద వందలాది మంది పోలీసులు పహారా కాస్తున్నారు.
కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలు, దానికి ప్రతిగా కౌశిక్ రెడ్డి ఇచ్చిన కౌంటర్లు చివరకు నగరాన్ని అశాంతి వైపు నెట్టేశాయి. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఒక పక్క బీజేపీ నేతలు తమ కార్యాలయాన్ని కాపాడుకునేందుకు మోహరించగా, మరోపక్క బీఆర్ఎస్ శ్రేణులు దాడిని నిరసిస్తూ ఆందోళనలు కొనసాగిస్తున్నాయి. ఈ హై వోల్టేజీ డ్రామాతో కరీంనగర్లో అత్యంత క్లిష్టమైన పరిస్థితులు నెలకొన్నాయి.

