పాఠశాల విద్యలోకి ‘ఇంటర్’
రద్దు కానున్న ఇంటర్మీడియట్ బోర్డు!
జాతీయ విద్యావిధానానికి అనుగుణంగా విప్లవాత్మక మార్పులకు శ్రీకారం
ఇకపై 12వ తరగతి వరకు ‘స్కూల్’ విద్యే.. నేడో రేపో ఆర్డినెన్స్ జారీ?
బోర్డుల విలీనంపై అధికారుల సుదీర్ఘ చర్చలు
ఉమ్మడి బోర్డుకు ‘టీజీఎస్ఈబీ’గా నామకరణం
విలీన కసరత్తు నేపథ్యంలో ఇంటర్ ప్రవేశాల ప్రక్రియకు ఆకస్మిక బ్రేక్
కాకతీయ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో మరో చారిత్రాత్మక నిర్ణయానికి సిద్ధమైంది. దశాబ్దాలుగా కొనసాగుతున్న విద్యా వ్యవస్థలో సమూల మార్పులు చేస్తూ, ఇంటర్మీడియట్ విద్యను పాఠశాల విద్యలో విలీనం చేసేందుకు రంగం సిద్ధం చేసింది. జాతీయ విద్యావిధానం సిఫార్సుల మేరకు 12వ తరగతి వరకు పాఠశాల విద్యను ఒకే గొడుగు కిందికి తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే, ప్రస్తుతం ఉన్న ఇంటర్మీడియట్ బోర్డు రద్దు కావడంతో పాటు, పాఠశాల విద్యా చట్టాల్లో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి.
‘ప్లస్ టూ’ విధానం.. 100 బడుల్లో పైలట్ ప్రాజెక్ట్
నూతన విధానంలో భాగంగా 10వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు జూనియర్ కళాశాలలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, అదే పాఠశాలలో 11, 12 తరగతులు (ప్లస్ టూ) చదివే అవకాశం కలుగుతుంది. 2026-27 విద్యా సంవత్సరం నుంచే ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా 100 ప్రభుత్వ పాఠశాలలను అధికారులు ఎంపిక చేశారు. ఈ ప్రక్రియ సక్సెస్ అయితే రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లోనూ ఇదే విధానం అమలవుతుంది. ఈ మేరకు తెలంగాణ ఎడ్యుకేషన్ యాక్టు (1982)ను సవరించి, ఇంటర్మీడియట్ విద్యా చట్టాన్ని (1971) రద్దు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీనికోసం నేడో రేపో ఆర్డినెన్స్ జారీ చేసే అవకాశం ఉంది.
ఉమ్మడి బోర్డుగా ‘టీజీఎస్ఈబీ’
ప్రస్తుతం వేర్వేరుగా ఉన్న ప్రభుత్వ పరీక్షల విభాగం, ఇంటర్మీడియట్ బోర్డులను కలిపి ఒకే ఉమ్మడి బోర్డుగా ఏర్పాటు చేయనున్నారు. దీనికి ‘తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు’ గా నామకరణం చేయాలని ప్రభుత్వం ఇప్పటికే ‘రైజింగ్ తెలంగాణ’ దార్శనిక పత్రంలో స్పష్టం చేసింది. గురువారం విద్యాశాఖ ఇన్ఛార్జి సెక్రటరీ శ్రీదేవసేన ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో అధికారులు ఈ విలీన ప్రక్రియపై సుదీర్ఘంగా చర్చించారు. కేంద్ర విద్యాశాఖ సూచనల మేరకు పది, ఇంటర్మీడియట్లకు కామన్ బోర్డు ఏర్పాటు చేయడం ద్వారా పాలనాపరమైన ఖర్చు తగ్గడంతో పాటు పర్యవేక్షణ సులభతరమవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
డ్రాపౌట్స్కు చెక్.. మౌలిక వసతుల మేళవింపు
పదో తరగతి తర్వాత విద్యార్థులు పైచదువులకు దూరం కాకుండా చూడటమే ఈ విలీనం ప్రధాన ఉద్దేశమని తెలుస్తోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు జూనియర్ కాలేజీలు అందుబాటులో లేక చదువు మానేస్తున్నారు. విలీనం వల్ల స్కూల్ స్థాయిలోనే ఇంటర్ అందుబాటులోకి వస్తే డ్రాపౌట్స్ తగ్గుతాయని ప్రభుత్వం ఆశిస్తోంది. అంతేకాకుండా, సమగ్ర శిక్షా, పీఎం శ్రీ వంటి కేంద్ర పథకాల ద్వారా అధిక నిధులు పొందే అవకాశం ఉంటుంది. స్కూల్స్, జూనియర్ కాలేజీల్లో ఉన్న ల్యాబ్లు, లైబ్రరీలను ఉమ్మడిగా వాడుకోవడం ద్వారా మౌలిక వసతుల కొరతను అధిగమించవచ్చని అధికారులు విశ్లేషిస్తున్నారు.
ఇంటర్ ప్రవేశాలపై ‘నిలిపివేత’ వేటు
విలీన ప్రక్రియ వేగవంతం కావడంతో, రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో జరగాల్సిన అడ్మిషన్ల ప్రక్రియకు బ్రేక్ పడింది. వాస్తవానికి మే 8 (ఈరోజు) నుంచి ఇంటర్ ప్రథమ సంవత్సర ప్రవేశాలు ప్రారంభం కావాల్సి ఉంది. బోర్డు కార్యదర్శి అభిలాష అభినవ్ ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసినప్పటికీ, ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలతో అడ్మిషన్ల ప్రక్రియను నిలిపివేశారు. విద్యా వ్యవస్థలో కీలక సంస్కరణలు అమలు చేస్తున్న నేపథ్యంలో, తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ప్రవేశాలు చేపట్టవద్దని స్పష్టం చేశారు. ఈ ఆకస్మిక నిర్ణయంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో కొంత గందరగోళం నెలకొన్నప్పటికీ, లాంగ్ టర్మ్లో ఇది ప్రయోజనకరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

