తూర్పార యంత్రంలో చిక్కుకొని మహిళా కూలి మృతి
కాశేగుడిసెలు గ్రామంలో మిన్నంటిన రోదనలు..
కాకతీయ, చేర్యాల : వరి ధాన్యం తూర్పార పట్టే యంత్రం రూపంలో ఒక నిరుపేద మహిళను మృత్యువు కబళించింది. యంత్రంలో తల వెంట్రుకలు చిక్కుకొని తీవ్ర గాయాలతో మహిళా కూలి అక్కడికక్కడే మృతి చెందిన హృదయవిదారక ఘటన సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం కాశేగుడిసెలు గ్రామంలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చేర్యాల మండలం కాశేగుడిశేలు గ్రామానికి చెందిన షేక్ ఇమాంబి (50) వ్యవసాయ కూలిగా జీవనం సాగిస్తోంది. సోమవారం కూలి పనిలో భాగంగా కాశేగుడిసెలు గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రం వద్ద తూర్పార పట్టే యంత్రం వద్ద పనిచేస్తోంది. ఈ క్రమంలో యంత్రంలో వడ్లు పోస్తుండగా, ప్రమాదవశాత్తూ ఆమె తల వెంట్రుకలు తిరుగుతున్న యంత్రం బెల్టులో చిక్కుకున్నాయి. క్షణాల్లో ఆమె తల యంత్రంలోకి వెళ్లడంతో తీవ్ర రక్తస్రావమై ప్రాణాలు కోల్పోయింది.
తీరని పుత్రశోకం.. అంతలోనే ఇలా
మృతురాలు ఇమాంబి కుటుంబం అత్యంత పేదరికంలో ఉంది. ఆమెకు నలుగురు కుమార్తెలు కాగా, ఉన్న ఒక్కగానొక కుమారుడు కూడా ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. పుత్రశోకంతో కుమిలిపోతున్న ఆమె, కుటుంబ భారాన్ని మోస్తూ కూలి పనులకు వెళ్తోంది. ఇంతలోనే ఇమాంబి కూడా మరణించడంతో ఆ కుటుంబం దిక్కులేనిదైపోయింది. తల్లి మరణవార్త విన్న కుమార్తెలు, బంధువులు ఘటనా స్థలంలో చేసిన రోదనలు స్థానికుల కళ్లు చెమ్మగిల్లేలా చేశాయి. ప్రమాద సమాచారం అందుకున్న చేర్యాల ఎస్సై జి. అపూర్వరెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతురాలి భర్త షేక్ సుభాన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. రైతులు, కూలీలు యంత్రాల వద్ద పనిచేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా పోలీసులు సూచించారు. నిరుపేద కుటుంబానికి చెందిన ఇమాంబి మృతితో ఆ ఇల్లు చీకటిమయమైందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. కష్టపడి పనిచేసి కుటుంబాన్ని పోషిస్తున్న వ్యక్తిని కోల్పోవడం తీరని లోటని పేర్కొన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి, బాధిత కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని, ఆమె కుమార్తెల భవిష్యత్తుకు భరోసా ఇవ్వాలని పలువురు గ్రామస్థులు, రైతులు విజ్ఞప్తి చేశారు.

