మణుగూరులో కల్తీ మాంసం
ప్రజల ఆరోగ్యంతో వ్యాపారుల ఆటలు
అనారోగ్యంతో ఉన్న జీవాల మాంసం విక్రయం
ప్రభుత్వ ముద్ర లేకుండానే సాగిపోతున్న అమ్మకాలు
పట్టించుకోని మున్సిపాలిటీ, పశుసంవర్ధక శాఖ అధికారులు
కల్తీ మాంసంతో రోగాల బారిన పడుతున్న సామాన్య జనం
కాకతీయ, మణుగూరు : మణుగూరు పట్టణంలో మేక మాంసం కల్తీ విచ్చలవిడిగా సాగుతోంది. అమాయక ప్రజల ఆరోగ్యంతో వ్యాపారులు చెలగాటమాడుతుంటే, నాణ్యతను పర్యవేక్షించాల్సిన అధికారులు మాత్రం తమకేమీ తెలియనట్లు పట్టించుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రోగాల బారిన పడ్డ జీవాల మాంసాన్ని జోరుగా విక్రయం చేస్తున్నారు. సాధారణంగా ఆరోగ్యంగా ఉన్న మేకలు, గొర్రెలను మాత్రమే వధించాల్సి ఉంటుంది. కానీ కొంతమంది వ్యాపారులు తక్కువ ధరకే మేకలు వస్తున్నాయని గమనించి, రోగాల బారిన పడిన జీవాలను, చనిపోయే దశలో ఉన్న వాటిని కొనుగోలు చేసి ఆ మాంసాన్ని మార్కెట్ లో విక్రయిస్తున్నారని తెలుస్తోంది. మరికొన్ని చోట్ల మేక మాంసంలో ఇతర తక్కువ రకం మాంసాలను కలపడం, బరువు పెరగడానికి మాంసంలో రసాయనాలు, నీరు చేర్చడం వంటి అక్రమాలకు పాల్పడటం సంచలనం రేపుతోంది.


కల్తీ మాంసం వల్ల జబ్బుల పాలు
ఈ కల్తీ మాంసాన్ని తినడం వల్ల ప్రజలు గ్యాస్ట్రిక్, విరోచనాలు, అన్నం వికటించడం వంటి తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ఉదాహరణకు గత కొన్ని రోజుల క్రితం మణుగూరులోని ఒక వసతి గృహం విద్యార్థులకు అన్నం వికటించి, అనేక మంది విద్యార్థులు ఆసుపత్రి పాలైన విషయం మణుగూరు ప్రజానీకానికి అంతా తెలిసిందే. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని ప్రజానీకం గగ్గోలు పెడుతున్నారు. నిజానికి మార్కెట్లోకి వచ్చే మాంసం నాణ్యతను పరీక్షించడానికి మున్సిపల్, పశుసంవర్ధక, ఆహార భద్రతా విభాగాలు ఉన్నాయి. జీవాలను వధించే ముందే అవి ఆరోగ్యంగా ఉన్నాయా లేదా అని పశువైద్యులు ధృవీకరించాలి. కానీ క్షేత్రస్థాయిలో ఈ నిబంధనలు ఎక్కడా అమలు కావడం లేదు.
తనిఖీలు లేవు.. అడ్డుఅదుపూ లేదు
అధికారులు కనీసం మాంసం దుకాణాలను తనిఖీ చేసిన దాఖలాలు ఎక్కడా లేకపోవడం గమనార్హం. అంతా సాపీగానే ఉందని అధికారులు ఉండటంతో కల్తీ వ్యాపారులకు అడ్డుఅదుపు లేకుండా పోయింది. మాంసం నాణ్యతపై గతంలో పలువురు ఫిర్యాదులు చేసినా అధికారులు మొద్దునిద్ర వీడకపోవడం వెనుక పెద్ద ఎత్తున మామూళ్ల వ్యవహారం నడుస్తోందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రజల ఆరోగ్యంతో ఆటలు ఆడుతున్న వ్యాపారులపై ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, ప్రత్యేక బృందాలతో మాంసం మార్కెట్లలో ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని మణుగూరు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. లైసెన్స్ లేని దుకాణాలపై చర్యలు తీసుకోవాలని, కల్తీ మాంసం విక్రయించే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అధికారులు ధృవీకరించిన మాంసం లభించేలా చూసి, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులపై ఎంతైనా ఉంది.

