ప్చ్..!ఇలా అయితే ఏం పనిచేస్తాం
అధికారులకు కాంగ్రెస్ నేతల బెదిరింపులు?
పినపాకలో విధులు నిర్వహించలేకపోతున్నాం
అక్రమ ఇసుక వాహనాలను అడ్డుకుంటే నేతల హెచ్చరికలు
అధికార పార్టీ మాదే.. ఇక్కడ ఎలా ఉద్యోగాలు చేస్తారో చూస్తామంటూ రౌడీయిజం
మమ్మల్ని, మా పనులను అడ్డుకుంటే బదిలీ తప్పదంటూ నేతల దర్పం
అధికారులకు అండగా నిలవాలని కలెక్టర్కు విన్నపం
కాకతీయ, మణుగూరు : పినపాక మండలంలో అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు దళిత అధికారులపై రౌడీయిజం ప్రదర్శిస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నియోజకవర్గంలోని కొందరు నేతలు అక్రమంగా అర్ధరాత్రులు వాగుల నుంచి ఇసుక, మట్టి తోలకాలు జరుపుతున్నారు. వీటిని పట్టుకున్న అధికారులను వారు బహిరంగంగానే బెదిరింపులకు గురిచేస్తున్నారు. కులం పేరుతో నీచంగా మాట్లాడుతున్నారని కొందరు అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము చెప్పినట్లు వింటేనే ఇక్కడ ఉద్యోగాలు చేయగలరని, లేదంటే ఉన్నతాధికారులతో మాట్లాడి బదిలీలు చేయిస్తామని హెచ్చరిస్తున్నారు. ఈ ఒత్తిళ్లు, బెదిరింపుల కారణంగా అధికారులు మనశ్శాంతిగా విధులు నిర్వహించలేకపోతున్నారు.
మా వాహనాలు వదులుతావా.. వదలవా?
గత కొన్ని రోజుల క్రితం బయ్యారం ప్రాంతానికి చెందిన కొందరు అగ్రవర్ణాల నేతలు అర్ధరాత్రులు వాగుల నుంచి ఇసుక, మట్టి, కంకర దందా సాగిస్తున్నారు. అయితే అధికారులు రాత్రి వేళల్లో తనిఖీలు నిర్వహిస్తుండగా.. ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక, మట్టి, కంకర తరలిస్తున్న వాహనాలను గమనించి పట్టుకున్నారు. పట్టుకున్న ట్రాక్టర్లు, జేసీబీ, లారీలను ప్రభుత్వ కార్యాలయాలకు తరలించారు. సమాచారం అందుకున్న సదరు నాయకులు అక్కడికి చేరుకుని.. మా వాహనాలు వదులుతావా.. వదలవా అంటూ అధికారులపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఇక్కడ అధికారపక్షం మాదేనని, తమను అడ్డుకుంటే ఇక్కడ ఎలా ఉద్యోగాలు చేస్తారో చూస్తామంటూ వాగ్వాదానికి దిగారు. ఎంతసేపటికీ అధికారులు బెదరకపోవడంతో కేసు నమోదు చేసి వాహనాలను కోర్టుకు, స్థానిక తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు.
కలెక్టర్ గారు అండగా ఉండండి
సదరు నాయకులు నిత్యం ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చి మమ్మల్ని, మా పనులను అడ్డుకుంటే మాత్రం మీకు బదిలీలు ఖాయమని బెదిరిస్తున్నట్లు అధికారులు చెప్పుకొస్తున్నారు. ఈ విషయమై ఎన్నో సార్లు స్థానిక శాసనసభ్యుడు పాయం వెంకటేశ్వర్లకు కూడా ఫిర్యాదు చేశారు. దీనిపై శాసనసభ్యుడు స్పందిస్తూ.. ఎవరైనా సరే తన పేరు చెప్పి రాత్రుళ్లు అనుమతులు లేకుండా దందాలు చేస్తే సహించేది లేదని, చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. బయ్యారంలో ప్రభుత్వ భూములు కబ్జా చేయడం, ఇసుక, మట్టి దందాలు చేసి కోట్ల రూపాయలు గడిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి దళిత, గిరిజన అధికారులకు అండగా నిలవాలని, దందాలు చేసే వ్యక్తులపై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

