భూకబ్జాను తేల్చరా..?
12ఏళ్లుగా నానబెడుతున్న యంత్రాంగం
పేద విద్యార్థుల బడిని కూల్చిన వారికి శిక్షలుండవా..?
గిఫ్ట్డీడ్ స్థలాన్ని కూడా మాయం చేసేందుకు జరిగిన కుట్ర
నిందితులను కాపాడేందుకు అధికారుల నిర్విరామ కృషి
నివేదికలు సమర్పించకుండా కోర్టు ఆదేశాలు సైతం బేఖాతర్
నివేదికల కోసమే కొనసాగుతున్న ఏళ్ల తరబడి వాయిదాలు
ప్రభుత్వాలు మారినా దర్యాప్తులో తీవ్ర జాప్యం
అధికారుల్లో చలనం ఏది? నిందితులను కాపాడుతోందెవ్వరు?
మున్సిపల్ స్కూల్ కూల్చివేతపై అప్పట్లో కమిషనర్ సస్పెన్షన్
నిందితులపై ‘లాండ్ గ్రాబింగ్’ కేసులు
తప్పుడు నివేదికలు సమర్పిస్తూ కాలయాపన చేస్తున్న ఘనులు
వ్యాపార, రాజకీయ పలుకుబడితో కేసు నీరుగార్చే ప్రయత్నం
కాకతీయ, ఖమ్మం బ్యూరో : ఖమ్మం నగర నడిబొడ్డున ఎంతో మంది పేద విద్యార్థినులకు విద్యాబుద్ధులు నేర్పిన ‘బంగారం లాంటి బడి’ని అక్రమంగా కూల్చివేసిన ఉదంతంలో నమోదైన భూకబ్జా, చీటింగ్ కేసు పన్నెండేళ్లుగా సాగుతూనే ఉంది. నివేదికలను తయారు చేయడంలో అధికారులు తాత్సరం చేస్తూ భూ కబ్జాను దాచి పెడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఖమ్మం మూడోపట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో 2014 వ సంవత్సరంలో నమోదైన ఈ ప్రతిష్ఠాత్మక కేసు (నెంబర్ 67 / 2014) విచారణలో ఘోరమైన జాప్యం జరుగుతోంది. ప్రధాన నిందితులైన కొప్పు నరేష్ కుమార్, పల్వరపు శ్రీనివాస్, పాలవరపు శ్రీరాములు, కొప్పు ఉమా మహేశ్వరరావులపై ఐపీసీ సెక్షన్లు 120 బి, 506, 452, 427, 420 తో పాటు ప్రతిష్ఠాత్మకమైన భూకబ్జా నిరోధక చట్టం కింద కేసులు నమోదయ్యాయి. 2014 లో ఎఫ్ఐఆర్ నమోదు కాగా, పోలీసులు చార్జ్షీట్ దాఖలు చేయడానికి ఏకంగా 8 ఏళ్ల సమయం పట్టింది. 2022లో ఈ కేసు ఖమ్మం జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో క్యాలెండర్ కేసుగా (సీసీ నెంబర్ 13 / 2022) రిజిస్టర్ అయినప్పటికీ, గడిచిన 4 ఏళ్లుగా కేవలం “అధికారిక నివేదికల కోసం” అంటూ కోర్టులో విచారణ నిరంతరం వాయిదా పడుతూనే వస్తోంది. తాజాగా ఈ కేసు తదుపరి విచారణను ఏకంగా జులై 15, 2026 కి వాయిదా వేయడం గమనార్హం. బాధ్యత గల మున్సిపల్, రెవెన్యూ అధికారులు సరైన సమయానికి పక్కా నివేదికలు న్యాయస్థానానికి సమర్పించకపోవడం వల్లే ఈ కేసు దశాబ్దానికి పైగా నలుగుతోందని, నిందితులు కోర్టును సైతం తప్పుడు సమాచారంతో మోసం చేస్తున్నారని బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

300 మంది చదువుతున్న బడిపై బిల్డర్ కన్ను!
ఈ వివాదాస్పద భూకబ్జా అరాచకం వెనుక ఉన్న అసలు కథ ఇలా ఉంది. ఖమ్మం నగరంలోని మూడోపట్టణ పరిధిలో గల సుందర్ సినిమా హాల్ సమీపంలో గతంలో ఒక ప్రభుత్వ బాలికల ప్రాథమిక పాఠశాల ఉండేది. ఆ పాఠశాల సంరక్షణకు పాలవరపు శ్రీరాములు కుటుంబీకులు పేద బాలికల విద్యాభివృద్ధిని కాంక్షిస్తూ సుమారు 500 గజాలకు పైగా విలువైన స్థలాన్ని కొన్ని దశాబ్దాల క్రితమే ప్రభుత్వానికి అధికారికంగా బహుమతిగా ఇవ్వడం జరిగింది. అయితే ఏళ్లు గడుస్తున్నా కొద్దీ నగరంలో ఆ భూమికి విపరీతమైన డిమాండ్ పెరిగి, కోట్ల రూపాయల విలువైన ఆస్తిగా మారింది. దీనిని అదునుగా చేసుకున్న సదరు పాలవరపు కుటుంబీకులకు అత్యంత దగ్గరి చుట్టం, అప్పటికే రైస్ మిల్లు, కందిపప్పు వ్యాపారాలు చేస్తూ కొత్తగా బిల్డర్ అవతారమెత్తిన కొప్పు నరేష్ కన్ను ఆ ప్రభుత్వ బడి స్థలంపై పడింది. ఎలాగైనా ఆ భూమిని కబ్జా చేయాలనే దురాశతో అతను తనకు తెలిసిన ఒకరిద్దరు లొసుగులు తెలిసిన సీనియర్ జర్నలిస్టుల సహకారంతో, కొంతమంది అప్పటి అధికార పార్టీ రాజకీయ నాయకుల అండదండలు చూసుకుని రంగంలోకి దిగాడు. నాటి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, పట్టణ ప్రణాళికా విభాగం అధికారులను అక్రమ మార్గంలో లోబరుచుకుని, సుమారు 300 మందికి పైగా విద్యార్థినులతో కళకళలాడుతూ నడుస్తున్న ఆ ప్రభుత్వ పాఠశాల భవనాన్ని రాత్రికి రాత్రే అత్యంత నిర్దయాత్మకంగా కూల్చేశాడు.
నాడు కమిషనర్ సస్పెన్షన్.. నేడు కేసు నీరుగార్చే యత్నం!
అప్పట్లో ఒక ప్రభుత్వ పాఠశాలను ప్రైవేటు వ్యక్తుల కోసం అడ్డగోలుగా కూల్చివేయడం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే కాకుండా మొత్తం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. విద్యాసంఘాలు, ప్రజాసంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగడంతో ఉన్నతాధికారులు స్పందించి, నాటి మున్సిపల్ కమిషనర్ బి. శ్రీనివాసరావును తక్షణమే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. బడిని కూల్చిన కొప్పు నరేష్, అతని తమ్ముడితో పాటు మిగిలిన నిందితులపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. దీంతో నిందితులు ముందస్తు బెయిల్ కోసం కోర్టుల చుట్టూ తిరిగినా సంపూర్ణ ఫలితం లేకపోవడంతో కొంతకాలం పాటు అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయారు. పోలీసులు వారి కోసం గాలింపులు చేపట్టినప్పటికీ.. నిందితుడు కొప్పు నరేష్ వర్తక సంఘం అధ్యక్షుడిగా ఉన్న తన పదవిని, రాజకీయ పలుకుబడిని అడ్డుపెట్టుకుని పోలీసు దర్యాప్తును ఏళ్ల తరబడి ముందుకు సాగకుండా అడ్డుకున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. ఆ ప్రలోభాల వల్లే 2022 వరకు చార్జ్షీట్ దాఖలు కాకుండా పోస్ట్పోన్ చేయించగలిగారు. చివరకు కోర్టు ఆదేశాలతో పోలీసులు చార్జ్షీట్ సమర్పించినా.. ఇప్పటికీ మున్సిపల్ అధికారుల నుంచి కోర్టుకు అందాల్సిన కీలకమైన సాక్ష్యాధారాలు, ల్యాండ్ రికార్డుల నివేదికలు అందకుండా నిందితులు తెర వెనుక చక్రం తిప్పుతున్నారు. ప్రభుత్వాలు మారినా అధికారుల తీరులో మార్పు రాకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్ ప్రత్యేక జోక్యం చేసుకుని న్యాయస్థానానికి పక్కా సాక్ష్యాలు అందేలా చూడాలని, కూల్చివేసిన చోటే మళ్లీ ప్రభుత్వ పాఠశాల భవనాన్ని నిర్మించి, నిందితులను కఠినంగా శిక్షించాలని ఖమ్మం పట్టణ ప్రజలు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.

