లిఫ్ట్లో ఇరుక్కున్న డీఆర్డీఏ ఏపీడీ
గంటన్నర పాటు నరకయాతన
సాంకేతిక లోపంతో నిలిచిన లిఫ్ట్.. ఊపిరి ఆడక ఇబ్బంది
కాకతీయ, రాజన్న సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ లో మంగళవారం సాంకేతిక లోపంతో లిఫ్ట్ మధ్యలోనే ఆగిపోవడంతో డీఆర్డీఏ ఏపీడీ కూర నర్సింహులు గంటన్నర పాటు అందులోనే ఇరుక్కుపోయారు. ఉదయం విధులకు హాజరయ్యేందుకు వచ్చిన ఆయన పై అంతస్తుకు వెళ్లేందుకు లిఫ్ట్ ఎక్కారు. మధ్యలోకి వెళ్లాక సాంకేతిక లోపంతో అది ఆగిపోయింది. లోపల గాలి ఆడకపోవడంతో ఇబ్బంది పడ్డ ఏపీడీ.. “ఊపిరి ఆడటం లేదు” అంటూ తోటి ఉద్యోగులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. ఆందోళనకు గురైన సిబ్బంది వెంటనే లిఫ్ట్ నిర్వహణ సిబ్బందిని పిలిపించారు. వారు సుమారు గంటన్నర పాటు శ్రమించి తలుపులు తెరిచి ఏపీడీని సురక్షితంగా బయటకు తీసుకురావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం లిఫ్ట్ నిర్వహణ సిబ్బంది తీరుపై ఏపీడీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


