ఘనంగా బక్రీద్ వేడుకలు
ఆత్మకూరు మండల వ్యాప్తంగా ముస్లింల ప్రత్యేక సామూహిక ప్రార్థనలు
ఈద్గాల వద్ద వెల్లివిరిసిన మతసామరస్యం..
కాకతీయ, ఆత్మకూరు: త్యాగానికి ప్రతీక అయిన పవిత్ర బక్రీద్ పండుగను ఆత్మకూరు మండల వ్యాప్తంగా ముస్లిం సోదరులు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మండల కేంద్రంతో పాటు హౌజుబుజుర్గు, కటాక్షపూర్, పెద్దాపురం, అక్కంపేట, మలక్పేట, పెంచికలపేట తదితర గ్రామాల్లోని ముస్లింలు తెల్లవారుజాము నుంచే నూతన వస్త్రాలు ధరించి ఈద్గా మైదానాలకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. అక్కడ ప్రత్యేక సామూహిక నమాజ్ నిర్వహించి, దేశ శాంతి, సౌభాగ్యాల కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రార్థనలకు ముందు మత పెద్దలు బక్రీద్ విశిష్టతను వివరించారు. త్యాగం, కరుణ, సోదరభావం స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ జీవించాలని, పేదలను ఆదుకోవాలని సందేశమిచ్చారు. హౌజుబుజుర్గు గ్రామంలో మస్జిద్ ఆబీదా యూసఫ్ కమిటీ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి. మత గురువు షేక్ ఫయాజ్ ముస్లింలకు పండుగ సందేశాన్ని అందించారు.
వెల్లివిరిసిన మత సామరస్యం
ప్రార్థనల అనంతరం ముస్లిం సోదరులు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ‘ఈద్ ముబారక్’ అంటూ బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పలు గ్రామాల్లో ఇతర మతాలకు చెందిన ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు ఈద్గాల వద్దకు స్వయంగా వచ్చి ముస్లింలకు శుభాకాంక్షలు తెలపడంతో మండలంలో మతసామరస్యం వెల్లివిరిసింది. పండుగను పురస్కరించుకుని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా స్థానిక పోలీసులు ముందస్తుగా పటిష్ట బందోబస్తు నిర్వహించారు. ఈ వేడుకల్లో మస్జిద్ కమిటీ కార్యదర్శి సయ్యద్ వలి, సభ్యులు సయ్యద్ కరీం, వార్డు సభ్యులు షేక్ కమాల్, షేక్ సలీం, ముస్లిం పెద్దలు షేక్ మౌలా, కరీం, యాకూబ్, అజీజ్ తదితరులు పాల్గొన్నారు.

