ప్రభుత్వ బడిలో ‘ప్రైవేట్’ దందా!
టీసీలు ఇచ్చే వేళ డొనేషన్ పేరిట అక్రమ వసూళ్లు
ఒక్కో విద్యార్థి నుంచి రూ. 300 – 500 గుంజుతున్న సిబ్బంది
సర్కార్ బడిలో అడ్డగోలు దోపిడీ.. నిమ్మకు నీరెత్తినట్లు విద్యాశాఖ అధికారులు!
బలవంతం లేదంటున్న హెచ్ఎం.. వసూళ్లు సబబేనంటూ ఎంఈవో వింత సమర్థన!
డబ్బులు ఇస్తేనే టీసీలు ఇస్తున్నారంటూ విద్యార్థుల ఆవేదన
కాకతీయ, గంభీరావుపేట : ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులకు ఉచిత విద్య అందించాల్సింది పోయి.. అక్కడే ప్రైవేట్ దందాను నడిపిస్తున్నారు కొందరు అధికారులు, సిబ్బంది. పదవ తరగతి పూర్తి చేసుకుని పైచదువుల కోసం వెళ్లే విద్యార్థులకు ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ (టీసీ) ఇచ్చే వేళ అడ్డగోలుగా కాసులు దండుకుంటున్నారు. గంభీరావుపేట మండల కేంద్రంలోని ప్రతిష్టాత్మక కేజీ టు పీజీ ప్రభుత్వ పాఠశాలలో ఈ దారుణ ఉదంతం వెలుగులోకి వచ్చింది. స్కూల్ అభివృద్ధికై ‘డొనేషన్’ ఇస్తేనే టీసీలు ఇస్తామంటూ ఒక్కో విద్యార్థి నుంచి రూ. 300 వరకు వసూలు చేస్తున్నారు. ఉచితంగా విద్యనందించాల్సిన సర్కార్ స్కూల్లో ఈ వసూళ్లు ఏంటని విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రశ్నిస్తే.. ఇక్కడ సిబ్బంది చెబుతున్న సమాధానాలు విని షాక్కు గురవడం బాధితుల వంతవుతోంది.

ఇదేం కొత్త కాదు.. అంతటా ఇంతేనట..!
“ఇక్కడ రూ. 300 వసూలు చేయడం ఇదేం కొత్త కాదు.. గత చాలా సంవత్సరాలుగా ఇదే తంతు కొనసాగుతోంది. మేమైతే కేవలం 300 తోనే సరిపెడుతున్నాం.. మండలంలోని మిగతా ప్రభుత్వ పాఠశాలల్లో రూ. 500 వరకు గుంజుతున్నారు” అంటూ టీసీలు ఇస్తున్న ఓ అటెండర్ క్షేత్రస్థాయిలో వ్యాఖ్యానించడం ఇక్కడి దోపిడీ తీవ్రతకు అద్దం పడుతోంది. స్కూల్లో స్కావెంజర్లను ప్రైవేటుగా నియమించామని, వారికి ఇవ్వాల్సిన జీతభత్యాలను కూడా విద్యార్థుల నుంచే వసూలు చేస్తున్నామని సిబ్బంది బాహాటంగానే ఒప్పుకుంటున్నారు. పాఠశాలల్లో నిర్వహించే జెండా పండుగలు, తాగునీటి సౌకర్యం, శానిటేషన్ అవసరాలకు ప్రభుత్వ నిధులు సమయానికి అందడం లేదని, అందినప్పటికీ అవి అరకొరగానే ఉంటున్నాయని.. అందుకే విద్యార్థుల జేబులకు చిల్లు పెడుతున్నామని పేరు చెప్పడానికి ఇష్టపడని కొందరు సిబ్బంది రిపోర్టర్ ముందు వాపోయారు.
ఇష్టపూర్వకంగా ఇస్తున్నారట.. అధికారుల వింత సమర్థన!
ఈ అక్రమ వసూళ్ల వ్యవహారంపై పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని ఫోన్ ద్వారా రిపోర్టర్ వివరణ కోరగా.. ఆయన బుకాయించే ప్రయత్నం చేశారు. తాము ఎవరి వద్ద బలవంతంగా తీసుకోవడం లేదని, విద్యార్థులే ఇష్టపూర్వకంగా ఇస్తుంటే తీసుకుని స్కూల్ అభివృద్ధికి వాడుతున్నామని చెప్పుకొచ్చారు. అయితే, ఇదే విషయమై గంభీరావుపేట మండల విద్యాధికారి (ఎంఈవో) గంగారాంను వివరణ కోరగా.. ఆయన అంతకంటే వింత సమాధానం ఇచ్చారు. టీసీ బుక్కుల ముద్రణకు అవుతున్న ఖర్చులు తామే భరిస్తున్నామని, అందుకోసం విద్యార్థుల నుండి రూ. 100 వరకు తీసుకోవడం సబబేనంటూ అక్రమ వసూళ్లకు అధికారిక ముద్ర వేసే ప్రయత్నం చేయడం గమనార్హం. అధికారులు ఏవేవో కారణాలు చెప్తున్నప్పటికీ.. తాము కచ్చితంగా రూ. 300 చెల్లిస్తేనే చేతిలో టీసీ పెడుతున్నారని, లేదంటే తిప్పించుకుంటున్నారని విద్యార్థులు లబోదిబోమనడం ఇక్కడి అసలు నిజాలను బయటపెడుతోంది.

