దోహాలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో సంస్కృతి సంప్రదాయాల ప్రదర్శన
ఐసీసీ వేదికగా జరిగిన కార్యక్రమానికి భారీగా తరలివచ్చిన తెలుగు ప్రజలు
కార్మికులకు అండగా నిలుస్తూ సామాజిక సేవలో ముందంజ
భవిష్యత్తులో మరిన్ని సేవా సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రణాళిక
నిర్వాహణలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ గల్ఫ్ సమితి ప్రతినిధులు
కాకతీయ, వేములవాడ : ఖతర్ రాజధాని దోహాలోని భారతీయ సాంస్కృతిక కేంద్రం (ఐసీసీ) వేదికగా తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా, ఘనంగా జరిగాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఖతర్లో నివసిస్తున్న తెలుగు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఖతర్లో తెలుగు ప్రజలకు ఎన్నో సంవత్సరాలుగా సేవలందిస్తున్న తెలంగాణ గల్ఫ్ సమితి, ఆపదలో ఉన్న కార్మికులకు అండగా నిలుస్తూ, అత్యవసర పరిస్థితుల్లో సహాయ సహకారాలు అందిస్తూ విశ్వసనీయ సంస్థగా గుర్తింపు పొందింది.
సామాజిక సేవలో గుర్తింపు
భారత రాయబార కార్యాలయం, ఖతర్ కార్మిక మంత్రిత్వ శాఖ, అంతర్జాతీయ కార్మిక సంస్థలతో సమన్వయంగా పనిచేస్తూ సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా సంస్థ నిర్వాహకులు తెలిపారు. తెలంగాణ గౌరవాన్ని అంతర్జాతీయ వేదికపై చాటుతూ, ప్రవాస తెలుగు ప్రజలను ఒక్కతాటిపైకి తీసుకువచ్చిన ఈ వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భవిష్యత్తులో మరిన్ని సేవా, సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించనున్నట్లు తెలంగాణ గల్ఫ్ సమితి ప్రతినిధులు వెల్లడించారు.
కార్యవర్గ సభ్యుల కృషి
ఈ వేడుకలను విజయవంతం చేయడంలో తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షుడు మైదా మధు, ప్రధాన కార్యదర్శి సంధ్య వినయ్ నాయకత్వం వహించగా, కార్యవర్గ సభ్యులు భవాని సాగర్, దుర్గం రాజేశ్వర్, గడ్డి రాజు, శంకర్ గౌడ్, ఎల్లయ్య తాళ్లపల్లి విశేష కృషి చేశారు. యువజన విభాగ సభ్యులు ముకుందం, రాజేష్, ప్రవీణ్, అరుణ్, ప్రసాద్, సుధాకర్, బొల్లె రాజ, గంగారం, దీపక్, మధు తదితరులు కార్యక్రమ నిర్వహణలో కీలక పాత్ర పోషించారు. కార్యక్రమానికి దాతలుగా సహకరించిన హరి రెడ్డి, సాగర్, రాథోడ్లకు తెలంగాణ గల్ఫ్ సమితి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. అలాగే కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కళాకారులు, స్వచ్ఛంద సేవకులు, ప్రేక్షకులకు సంస్థ ధన్యవాదాలు తెలియజేసింది.

