అభివృద్ధి బాటలో ముదిగొండ
గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు సర్కారు ప్రాధాన్యం
కోట్ల రూపాయల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం
నాణ్యమైన విద్యుత్ సరఫరాకు 33/11 కేవీ సబ్స్టేషన్ ఏర్పాటు
రవాణా వ్యవస్థ బలోపేతానికి 33 కోట్ల భారీ ప్రాజెక్టు
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
కాకతీయ, ముదిగొండ : “గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. నియోజకవర్గంలోని ప్రతి మారుమూల గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించడమే నా లక్ష్యం. ప్రజలకు మెరుగైన పాలనను, సౌకర్యాలను చేరువ చేయడమే ప్రభుత్వ ధ్యేయం” అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఆదివారం ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని ముదిగొండ మండలంలో ఆయన సుడిగాలి పర్యటన చేశారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేపట్టి స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎడవల్లి లక్ష్మీపురంలో 20 లక్షల రూపాయల ఉపాధి హామీ నిధులతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ భవనంతో ప్రజలకు పరిపాలనా సేవలు మరింత వేగంగా, పారదర్శకంగా అందుతాయని భరోసా ఇచ్చారు.

విద్యుత్ సమస్యలకు శాశ్వత పరిష్కారం
“ముదిగొండ మండలంలోని ఎడవల్లిలో రైతులకు, గృహ, వాణిజ్య అవసరాలకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు 3.15 కోట్ల రూపాయల వ్యయంతో 33/11 కేవీ సబ్స్టేషన్కు శంకుస్థాపన చేశాం. దీనివల్ల విద్యుత్ కోతలు తగ్గి, సాగుకు ఇబ్బందులు ఉండవు. అలాగే మండల కేంద్రంలో 25 లక్షల రూపాయలతో నిర్మించనున్న ఈఆర్వో కార్యాలయానికి భూమిపూజ నిర్వహించాం. ఈ కార్యాలయం అందుబాటులోకి వస్తే అధికారుల పర్యవేక్షణ పెరిగి, ప్రభుత్వ సేవలు మరింత వేగవంతం అవుతాయి” అని ఉప ముఖ్యమంత్రి తెలిపారు.
రవాణా వ్యవస్థకు కొత్త ఊపిరి
“ముదిగొండ అభివృద్ధిలో భాగంగా రవాణా సౌకర్యాలను మెరుగుపరచడంపై ప్రత్యేక దృష్టి సారించాం. ఎడవల్లి-తల్లంపాడు రహదారి విస్తరణతో పాటు ఎడవల్లి-లక్ష్మీపురం మీదుగా తెల్దారుపల్లి వరకు రోడ్డు నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టాం. ముఖ్యంగా కోదాడ-ఖమ్మం-కురివి, సూర్యాపేట-అశ్వారావుపేట జాతీయ రహదారులను అనుసంధానించే 33 కోట్ల భారీ ప్రాజెక్టు పనులకు భూమిపూజ చేశాం. ఇది ముదిగొండ రవాణా వ్యవస్థకు కొత్త ఊపిరి పోస్తుంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే వ్యవసాయ ఉత్పత్తుల తరలింపు సులభతరమై, పారిశ్రామికంగా ముదిగొండ అభివృద్ధి చెందుతుంది. పనుల్లో నాణ్యత విషయంలో అధికారులు రాజీ పడొద్దని, గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించాను” అని ఆయన పేర్కొన్నారు. అంతకుముందు ముదిగొండ మండల కేంద్రంలో 50 పడకలతో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిని ఆయన పరిశీలించారు. నిర్మాణ నాణ్యతను తనిఖీ చేసి, పేదలకు మెరుగైన వైద్యం అందేలా పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్, జాయింట్ కలెక్టర్ శ్రీనివాస రెడ్డి, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ నాయుడు సత్యనారాయణ, సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

