కార్మిక వ్యతిరేక విధానాలు మానుకోండి
సమస్యలు పరిష్కరించకుంటే పోరాటాలు ఉధృతం
సింగరేణికి రావాల్సిన రూ. 56 వేల కోట్ల బకాయిలు విడుదల చేయాలి
నిలిచిపోయిన మెడికల్ బోర్డులను పునరుద్ధరించాలి
కొత్త గనుల ప్రారంభానికి తక్షణ చర్యలు చేపట్టాలి
పెర్క్స్పై ఆదాయపు పన్నును యాజమాన్యమే భరించాలి
సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షుడు కూనంనేని సాంబశివరావు
కార్మికుల చెమట చుక్కలతోనే సంస్థ మనుగడ
చిన్నచూపు చూస్తే ఊరుకోమంటూ కేంద్ర కౌన్సిల్ సమావేశంలో స్పష్టీకరణ
కాకతీయ, కొత్తగూడెం: “కార్మికుల చెమట చుక్కలతోనే సింగరేణి సంస్థ మనుగడ సాగిస్తోంది. అటువంటి సంస్థకు మూలాధారమైన కార్మికులను చిన్నచూపు చూడటం యాజమాన్యానికి ఎంతమాత్రం తగదు. ఇప్పటికైనా యాజమాన్యం తన కార్మిక వ్యతిరేక విధానాలను మానుకోవాలి, లేనిపక్షంలో సింగరేణి వ్యాప్తంగా పోరాటాలు తప్పవు” అని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షులు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు హెచ్చరించారు. భద్రతా నిబంధనలు, కార్మికుల సంక్షేమాన్ని గాలికి వదిలేస్తున్న అధికారుల తీరును ఎండగడుతూనే, రాబోయే రోజుల్లో యూనియన్ చేపట్టబోయే పోరాట కార్యాచరణను ఆయన ప్రకటించారు. కొత్తగూడెంలోని ఆర్సీఓఏ క్లబ్లో ఆదివారం జరిగిన సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) కేంద్ర కౌన్సిల్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కార్మికుల హక్కులు, సంక్షేమం మరియు ఉద్యోగ భద్రతకు విఘాతం కలిగించే అనాలోచిత విధానాలను యాజమాన్యం వెంటనే ఉపసంహరించుకోవాలని ఈ సందర్భంగా కూనంనేని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి సింగరేణి సంస్థకు రావాల్సిన రూ. 56 వేల కోట్ల భారీ బకాయిలను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. సంస్థ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కొత్త గనుల ప్రారంభానికి యాజమాన్యం వెంటనే తగిన చర్యలు చేపట్టాలన్నారు. వీటితో పాటు కార్మికులకు ఎంతో కాలంగా నిలిచిపోయిన మెడికల్ బోర్డులను వెంటనే పునరుద్ధరించాలని, పెండింగ్లో ఉన్న డిపెండెంట్ ఉద్యోగాలు, పదోన్నతులు , మరియు ఖాళీగా ఉన్న క్లర్క్ పోస్టుల భర్తీ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. గతంలో వివిధ కారణాల వల్ల డిస్మిస్ అయిన కార్మికులకు తిరిగి విధుల్లోకి చేరేందుకు ఒక ప్రత్యేక అవకాశం కల్పించాలని యాజమాన్యానికి సూచించారు.
సమస్యలు పరిష్కరించకుంటే బొగ్గు గనుల్లో ఉద్యమమే!
సమావేశంలో యూనియన్ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్కుమార్ మాట్లాడుతూ యాజమాన్యం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక వైఖరిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కార్మికులకు ఇచ్చే పెర్క్స్పై విధించే ఆదాయపు పన్ను భారాన్ని యాజమాన్యమే పూర్తిగా భరించాలని డిమాండ్ చేశారు. గతంలో జరిగిన స్ట్రక్చర్ కమిటీ సమావేశాల్లో అంగీకరించిన అన్ని రకాల డిమాండ్లను రాతపూర్వకంగా వెంటనే అమలు చేయాలన్నారు. గనుల్లో పని చేస్తూ సహజ మరణం పొందిన కార్మికుని కుటుంబానికి ఇచ్చే ఎక్స్గ్రేషియాను రూ. 25 లక్షలకు పెంచి తక్షణమే చెల్లించాలని స్పష్టం చేశారు. సమస్యల పరిష్కారంలో యాజమాన్యం ఇకనైనా సానుకూలంగా స్పందించకపోతే సింగరేణి వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
కొమురయ్య కాంస్య విగ్రహ పునఃప్రారంభోత్సవం!
సోమవారం సాయంత్రం 4 గంటలకు సింగరేణి ప్రధాన కార్యాలయం (హెడ్ ఆఫీస్) ముందు అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగనున్న అమరవీరుడు, యూనియన్ అగ్రనేత కొమురయ్య కాంస్య విగ్రహ పునఃప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కార్మికులందరూ తరలివచ్చి విజయవంతం చేయాలని యూనియన్ నాయకులు పిలుపునిచ్చారు. ఈ కేంద్ర కౌన్సిల్ ఉన్నత స్థాయి సమావేశంలో ఏఐటీయూసీ సీనియర్ నాయకులు మిర్యాల రంగయ్య, సారయ్య, కందికట్ల వీరభద్రయ్య, వై.వి.రావు, ముస్కే సమ్మయ్య, వంగ వెంకట్, వీరస్వామి తదితర ముఖ్య నాయకులతో పాటు సింగరేణిలోని వివిధ ఏరియాలకు చెందిన బ్రాంచ్ సెక్రెటరీలు, ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

