‘స్టెమ్-60’కి గ్రహణం..
గిరిపుత్రుల ఐఐటీ కలలపై నీలినీడలు!
హన్మకొండ కేంద్రాన్ని రద్దు చేసేందుకు యత్నాలు
అత్యున్నత ఫలితాలు సాధించినా కొనసాగింపుపై మీనమేషాలు
అధికారుల మధ్య సమన్వయ లోపం..గిరిజన విద్యార్థులకు శాపం
అధికారుల ఈగోలకు బలి అవుతున్న విద్యార్థుల భవిష్యత్తు
స్టడీ సర్కిల్ నుంచి విద్యార్థులను మళ్లీ పాత బడులకే పంపే యత్నం
కార్పొరేట్ను తలదన్నే ప్రతిభ.. అభినందించని అధికార యంత్రాంగం
కలలను సాకారం చేసే ‘స్టెమ్-60’కి అడ్డంకులు
కాకతీయ,తెలంగాణ బ్యూరో : గిరిజన ప్రాంత విద్యార్థుల ఐఐటీ, ఎన్ఐటీ కలలను నిజం చేస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హన్మకొండ బాలసముద్రంలోని ‘స్టెమ్-60’ (STEM-60) కోచింగ్ సెంటర్ ఇప్పుడు ఉనికి కోసం పోరాడుతోంది. ఒకవైపు విద్యార్థులు అత్యున్నత విద్యాసంస్థల్లో సీట్లు సాధించి ప్రాంతానికి కీర్తి తెస్తుంటే, మరోవైపు అధికారుల ఈగోలు, శాఖల మధ్య సమన్వయలోపం ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమాన్ని నీరుగారుస్తున్నాయి. గత ఏడాది ఏటూరునాగారం ఐటీడీఏ చొరవతో హన్మకొండ బాలసముద్రంలోని ఓ భవనంలో ప్రారంభమైన ‘స్టెమ్-60’ అద్భుతమైన ఫలితాలను సాధించింది. దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మక విద్యాసంస్థలైన ఐఐటీలు, ఎన్ఐటీలలో గిరిజన విద్యార్థులు జెండా ఎగురవేస్తుంటే.. ఆ విజయానికి పునాదులు వేసిన ‘స్టెమ్-60’ కార్యక్రమంపై మాత్రం నీలినీడలు కమ్ముకుంటున్నాయి. అత్యున్నత ప్రమాణాలతో, గిరిజన విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపిన ఈ కోచింగ్ కేంద్రం, ప్రస్తుతం అధికారుల సమన్వయలోపం మరియు ఆధిపత్య పోరుకు బలి కావాల్సిన దుస్థితి నెలకొంది. ఈ ప్రాజెక్టు కేవలం ఒక్క విద్యా సంవత్సరంలోనే రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందింది. అయితే అద్భుతమైన ఫలితాలు వస్తున్న వేళ, ఈ కార్యక్రమాన్ని నీరుగార్చేలా జరుగుతున్న పరిణామాలు గిరిజన తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి.


కార్పొరేట్కు దీటుగా గిరిజన విద్యార్థుల జైత్రయాత్ర
ప్రైవేట్ కార్పొరేట్ కోచింగ్ సెంటర్లకు లక్షల్లో ఫీజులు చెల్లించినా దక్కని ఐఐటీ సీట్లను, గిరిజన బిడ్డలు ‘స్టెమ్-60’ ద్వారా అవలీలగా సాధించారు. ఈ ఏడాది జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్డ్ ఫలితాల్లో ఈ విద్యార్థులు కనబర్చిన ప్రతిభ దేశవ్యాప్త చర్చకు దారితీసింది. జి. సిద్ధు (ఐఐటీ మద్రాస్), ఎన్. పూజిత (ఐఐటీ ఖరగ్పూర్), టి. వరుణ్, బి. సంతోషిణి (ఐఐటీ గౌహతి), జి. శేఖర్ (ఐఐటీ జమ్మూ), కె. సంజీవని (ఎన్ఐటీ కాలికట్) వంటి విద్యార్థులు సాధించిన విజయాలు ఈ కోచింగ్ సెంటర్ నాణ్యతకు నిదర్శనం. ప్రభుత్వ ఆధ్వర్యంలో, అదీ అత్యంత వెనుకబడిన ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు ఇంతటి ఘనత సాధించడం అరుదైన విషయమని విద్యావేత్తలు కొనియాడుతున్నారు.
అధికారుల నిర్లక్ష్యం.. నిధుల కటకట
ఇన్ని విజయాలు సాధిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితి దారుణంగా ఉంది. కోచింగ్ కేంద్రం ప్రారంభమైనప్పటి నుంచీ గురుకులాల ఉన్నతాధికారుల మధ్య సమన్వయం లోపించింది. విద్యార్థులను ప్రత్యేక శిక్షణ కోసం తరలించడాన్ని కొందరు అధికారులు వ్యతిరేకించడంతో, ఈ కార్యక్రమానికి అవసరమైన బడ్జెట్, భోజన మెనూ, ఇతర మౌలిక వసతుల కల్పనలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. నిధులు లేక ఇబ్బందులు పడుతున్న సమయంలో, సిబ్బంది తమ సొంత జీతాల్లోంచి తమ జేబుల నుంచి ఖర్చు చేసి విద్యార్థులకు భోజన వసతి కల్పించారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం తమ సర్వస్వాన్ని ధారపోసిన సిబ్బందిని ప్రోత్సహించాల్సింది పోయి అధికారులు అడ్డంకులు సృష్టించడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రెండో సంవత్సరంపై అనిశ్చితి
ప్రస్తుతం మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న విద్యార్థులు రెండో సంవత్సరంలోకి అడుగుపెట్టాల్సి ఉంది. ఇప్పటికే సిలబస్పై పట్టు సాధించిన ఈ విద్యార్థులు, అదే వాతావరణంలో శిక్షణను కొనసాగించాలని ఆశిస్తున్నారు. అయితే, వీరిని మళ్లీ స్టడీ సర్కిల్లోకి తీసుకుంటే బడ్జెట్ భారం పెరుగుతుందనే సాకుతో, మళ్లీ వారిని ఆయా ఆశ్రమ పాఠశాలలకే పంపించాలని అధికారులు యోచిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ ఇదే జరిగితే, గడిచిన ఏడాది పాటు వారు పొందిన ప్రత్యేక శిక్షణ నిరుపయోగం కావడమే కాకుండా, వారి ఐఐటీ లక్ష్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. శాఖల మధ్య ఆధిపత్య పోరులో విద్యార్థులు బలి కావడం ఎంతవరకు సమంజసమని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.
గిరిజన విద్యార్థుల భవిష్యత్తుపై ఆందోళన
ప్రభుత్వ ఆధ్వర్యంలో ‘స్టెమ్-60’ వంటి పథకాలు విజయవంతంగా నడుస్తున్నప్పుడు, వాటిని మరింత విస్తరించాల్సింది పోయి, నిర్వీర్యం చేసే దిశగా అడుగులు పడటం దురదృష్టకరం. ఐఐటీలు, ఎన్ఐటీల్లో సీట్లు సాధించిన విద్యార్థులను కనీసం అభినందించే తీరిక కూడా అధికారులకు లేకపోవడం వారి నిరాసక్తతను చూపుతోంది. వ్యక్తిగత ఈగోలను పక్కనపెట్టి, గిరిజన విద్యార్థుల కలలను నిజం చేసే ఈ మహత్తర కార్యక్రమానికి అండగా నిలవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం వెంటనే స్పందించి, నిధులను మంజూరు చేయడమే కాకుండా, అధికారుల మధ్య సమన్వయం ఉండేలా చర్యలు తీసుకోవాలని, లేదంటే గిరిజన విద్యార్థుల పాలిట ఈ ‘స్టెమ్-60’ కేవలం ఒక తీరని కలగానే మిగిలిపోతుందని మేధావులు హెచ్చరిస్తున్నారు.

