చొరబాటుదారుల ఓట్లు తొలగిస్తే తప్పేంటి..?
విదేశీ ముస్లింలతో పోల్చడం అత్యంత అవమానకరం
మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు కాంగ్రెస్ కుట్ర
కిషన్ రెడ్డి మెట్రోను అడ్డుకుంటున్నారనడం అసత్య ప్రచారం
బీఆర్ఎస్లో మావోయిస్టు భావజాల నేతలు..కవిత చెప్పింది నిజమే
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్
మానకొండూరులో ఆర్ఎంపీ వైద్యులతో ‘చాయ్ పే చర్చ’
కాకతీయ, కరీంనగర్ : విదేశీ అక్రమ చొరబాటుదారుల ఓట్లను తొలగిస్తే తప్పేముందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల నుంచి అక్రమంగా చొరబడి ఓటరు కార్డులు పొందిన వారి ఓట్లను తొలగించాలా? వద్దా? అనే అంశంపై కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన వైఖరి వెల్లడించాలని డిమాండ్ చేశారు. మోదీ ప్రభుత్వం 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని మానకొండూరులో ఆర్ఎంపీ వైద్యులతో నిర్వహించిన “చాయ్ పే చర్చ” కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ దేశ పౌరుల ఓట్లను తొలగించే హక్కు ఎవరికీ లేదని, అక్రమ వలసదారుల విషయంలోనే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ కుట్రలను తిప్పికొట్టాలి
కాంగ్రెస్ పార్టీ ఎస్ఐఆర్ (సర్) అంశాన్ని మతపరమైన కోణంలో చూపిస్తూ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోందని బండి సంజయ్ ఆరోపించారు. విదేశీ ముస్లిం చొరబాటుదారులను దేశ ముస్లింలతో పోల్చడం ద్వారా ముస్లిం సమాజాన్ని అవమానిస్తున్నదన్నారు. ఇక్కడి ముస్లింల ఓట్లను తొలగిస్తారని భయాందోళనలు సృష్టించడం కాంగ్రెస్ కుట్ర అని విమర్శించారు. దేశ చరిత్రలో 4,400 రోజులకు పైగా ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన ఘనత నరేంద్రమోదీకే దక్కిందని, గత యూపీఏ పాలనతో పోలిస్తే మోదీ 12 ఏళ్ల పాలనలో అభివృద్ధి, సంక్షేమం, పారదర్శకత స్పష్టంగా కనిపిస్తున్నాయని కొనియాడారు. స్టార్టప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా వంటి కార్యక్రమాలతో దేశాన్ని ఎగుమతుల దిశగా తీసుకెళ్లామన్నారు.
తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది
తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, గత 12 ఏళ్లలో రాష్ట్రానికి 12 లక్షల కోట్ల రూపాయలకు పైగా నిధులు మంజూరు చేసినట్లు బండి సంజయ్ తెలిపారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మెట్రో రెండో దశ ప్రాజెక్టును అడ్డుకుంటున్నారన్న ముఖ్యమంత్రి వ్యాఖ్యల్లో వాస్తవం లేదని కొట్టిపారేశారు. అడ్డుకోవాలనే ఉద్దేశం ఉంటే తెలంగాణకు ఇంత భారీగా నిధులు ఎందుకు వస్తాయని ప్రశ్నించారు. హైదరాబాద్, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ల అభివృద్ధికి కూడా కేంద్రం వేల కోట్ల రూపాయల నిధులు అందిస్తోందని గుర్తుచేశారు.
మావోయిస్టు భావజాలంపై విమర్శలు
బీఆర్ఎస్ పార్టీలో మావోయిస్టు భావజాలం కలిగిన నేతలు ఉన్నారని ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు వాస్తవమేనని బండి సంజయ్ పేర్కొన్నారు. అలాంటి భావజాలం సమాజానికి ప్రమాదకరమని హెచ్చరించారు. తుపాకీ గొట్టంతో సాధించేదేమీ లేదని మావోయిస్టులే గ్రహించి జనజీవన స్రవంతిలో కలిసిపోయారని, ఆ భావజాలాన్ని ఇంకా విడిచిపెట్టని నాయకులు కూడా ఆలోచించకపోతే వారి భవిష్యత్కే నష్టమని వ్యాఖ్యానించారు. బెంగాల్లో అక్రమ వలసదారుల ఓట్లను తొలగించామని, విదేశీ చొరబాటుదారులకు ఓటు హక్కు ఇవ్వాలనుకుంటుందో లేదో కాంగ్రెస్ తన వైఖరిని ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ స్థానిక నాయకులు, ఆర్ఎంపీ వైద్యుల సంఘం ప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

