ఏటూరునాగారంలో ‘భూ’ కబ్జాల పర్వం
రాళ్లకుంట చెరువు 209 సర్వే నంబర్లో అక్రమాల కలకలం
స్థానికేతర గిరిజనుల పేరుతో భూఆక్రమణలు
సాగు భూములను కాపాడాలంటూ గిరిజన, గిరిజనేతర రైతుల ఆందోళన
హద్దులు చెరిపేసి.. అక్రమ నిర్మాణాలకు యత్నాలు
నిమ్మకు నీరెత్తినట్లుగా అధికారుల వైఖరి
కాకతీయ, ఏటూరునాగారం రూరల్ : ములుగు జిల్లా ఏటూరునాగారంలో భూ కబ్జాల వ్యవహారం మళ్లీ వివాదాస్పదంగా మారింది. మండల కేంద్రంలోని గిరిజన కోపరేటివ్ సొసైటీ వెనుక ఉన్న రాళ్లకుంట చెరువు శివారులో, 209 సర్వే నంబర్ భూములను స్థానికేతరులు అక్రమంగా కబ్జా చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలు స్థానికులను తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తున్నాయి. శాంతియుతంగా సాగుతున్న గిరిజన, గిరిజనేతర రైతుల భూములను కబ్జా చేసేందుకు జరుగుతున్న యత్నాలపై జిల్లా యంత్రాంగం కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. దశాబ్దాలుగా ఏటూరునాగారంలో గిరిజన, గిరిజనేతర కుటుంబాలు ఎటువంటి విభేదాలు లేకుండా కలిసి జీవిస్తుండగా, ఇటీవల కొందరు బయటి వ్యక్తులు ప్రవేశించి వివాదాలను సృష్టిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. నూగూరు, వెంకటాపురం, వాజేడు ప్రాంతాలకు చెందిన కొందరు వ్యక్తులు, స్థానికంగా ఉన్న పెనక నాగమణి, బడే సులోచన, శమంతకమణి, బొల్లం సారయ్య వంటి వారి సహకారంతో అక్రమాలకు పాల్పడుతున్నారని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరి స్వార్థ ప్రయోజనాల కోసం మొత్తం గిరిజన సమాజం పరువు ప్రతిష్టలు మసకబారుతున్నాయని, అమాయక గిరిజనులను ఆసరాగా చేసుకుని అక్రమార్కులు సాగిస్తున్న ఈ దందాకు అడ్డుకట్ట వేయాలని స్థానిక గిరిజనులు గళమెత్తారు. ఈ వివాదంలో బొల్లం సారయ్య అనే వ్యక్తి కీలక పాత్ర పోషిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. జాతీయ రహదారి-163 పక్కన ఉన్న ఓ దళితుడి భూమిని సైతం సదరు వ్యక్తి కబ్జా చేసి సాగు చేస్తున్నాడని, అంతేకాకుండా రాళ్లకుంట చెరువు శివారులో ఇంటి స్థలాల పేరుతో హద్దులు వేసి ఆక్రమణకు పాల్పడుతున్నాడని గ్రామస్థులు పేర్కొన్నారు. భూమిని అక్రమించుకోవడమే కాకుండా, పక్కాగా హద్దులు ఏర్పాటు చేసి ఆక్రమణను స్థిరీకరించేందుకు చేస్తున్న ప్రయత్నాలు స్థానికులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
పోలీసుల రంగప్రవేశం.. ఉద్రిక్తత
భూ కబ్జాల వ్యవహారం ఉద్రిక్తరూపం దాల్చడంతో విషయం తెలుసుకున్న ఏటూరునాగారం పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. వివాదాస్పద భూముల వద్ద ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరగడంతో, ఉద్రిక్తతలు పెరగకుండా పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఆ భూమి యాజమాన్య హక్కులు, ఆక్రమణల ఆరోపణలపై పోలీసులు విచారణ ప్రారంభించారు. మరోవైపు, ఈ భూ కుంభకోణంపై రెవెన్యూ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి, ప్రభుత్వ రికార్డులను పరిశీలించి వాస్తవాలను వెలికితీయాలని స్థానికులు కోరుతున్నారు.
అధికారుల జవాబుదారీతనం ఏది?
ప్రభుత్వ భూమిని, లేదా పేదల సాగు భూమిని అక్రమార్కులు ఆక్రమిస్తుంటే రెవెన్యూ యంత్రాంగం ఎందుకు మౌనంగా ఉంటుదన్నది ప్రశ్నార్థకంగా మారింది. క్షేత్రస్థాయిలో ఉన్న కబ్జాల సమాచారం అధికారులకు తెలియదా? లేక తెలిసీ చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుని, రైతుల జీవన హక్కులను కాపాడాలని, ఏటూరునాగారంలో అశాంతిని రేపుతున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని స్థానిక గిరిజన, గిరిజనేతర జేఏసీ ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. జిల్లా ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించి, వివాదాస్పద 209 సర్వే నంబర్ భూములపై స్పష్టత ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు.

