వర్షాల కోసం గ్రామ దేవతలకు జలాభిషేకాలు
కాకతీయ, ఇల్లంతకుంట: వర్షాలు సమృద్ధిగా కురవాలని ప్రార్థిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం కందికట్కూర్ గ్రామంలోని అన్ని దేవాలయాల్లో గ్రామ ఉపాధి హామీ కూలీలు ప్రత్యేక జలాభిషేకాలు నిర్వహించారు. వానదేవుడు కరుణించి మంచి వర్షాలు కురిపించాలని కోరుతూ భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. వర్షాభావంతో ఎండల తీవ్రత పెరిగి పొలాలు బీడుగా మారుతున్న నేపథ్యంలో గ్రామ ప్రజలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలీలు, మహిళలు మాట్లాడుతూ రైతులు వర్షాల లేమితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో దైవ కృప కోసం అందరూ కలిసి పూజలు నిర్వహించామని, వానదేవుడు తమ ప్రార్థనలు ఆలకించి సమృద్ధిగా వర్షాలు కురిపిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశారు.

