ప్రభుత్వ బడుల్లో సమస్యల తాండవం
ఉపాధ్యాయుల కొరతతో విద్యార్థుల అవస్థలు
గంభీరావుపేట మండలంలో 23 ఉపాధ్యాయ పోస్టుల ఖాళీ
మౌలిక వసతుల కల్పనలో నిర్లక్ష్యంపై విద్యార్థుల ఆందోళన
కాకతీయ, గంభీరావుపేట : విద్యా సంవత్సరం ప్రారంభమై పాఠశాలలు తెరిచిన వేళ, గంభీరావుపేట మండలంలోని ప్రభుత్వ విద్యా సంస్థలు సమస్యల వలయంలో చిక్కుకున్నాయి. మండలంలోని 43 పాఠశాలల్లో (12 జెడ్పీహెచ్ఎస్, 31 ప్రాథమిక) 3,294 మంది విద్యార్థులు ఉండగా, నిబంధనల ప్రకారం ఉండాల్సిన 221 మంది ఉపాధ్యాయులకు గానూ కేవలం 198 మంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. దీంతో 23 పోస్టులు ఖాళీగా ఉండి బోధన కుంటుపడుతోంది. దోసలగూడెం, ముచ్చర్ల, ముస్తఫానగర్, మల్లారెడ్డిపేట, లింగన్నపేట తండా పాఠశాలల్లో కిచెన్ షెడ్లు, ప్రహరీ గోడల కొరత తీవ్రంగా వేధిస్తోంది. లింగన్నపేట, గోరంటాల పాఠశాలల్లో కనీస మరుగుదొడ్ల సౌకర్యం కూడా లేకపోవడంతో విద్యార్థులు, ముఖ్యంగా బాలికలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొత్తపల్లి ఎస్సీ కాలనీ పాఠశాల భవనం స్లాబ్ పెచ్చులు ఊడిపడుతూ విద్యార్థుల ప్రాణాలకు ప్రమాదకరంగా మారింది. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు, డిప్యూటేషన్ల వల్ల చాలా పాఠశాలల్లో సిబ్బంది కొరత ఏర్పడిందని స్థానికులు విమర్శిస్తున్నారు.
సత్తా చాటుతున్న విద్యార్థులు.. అయినా పట్టించుకోని సర్కారు
సమస్యలు ఉన్నా, గంభీరావుపేట మండల విద్యార్థులు ఫలితాల్లో మెరుగైన ప్రతిభను ప్రదర్శిస్తున్నారు. 2025-26 విద్యా సంవత్సరంలో పదవ తరగతి పరీక్షల్లో 536 మందికి గానూ 519 మంది ఉత్తీర్ణత సాధించారు. ఏకంగా ఏడుగురు విద్యార్థులు ప్రతిష్టాత్మక త్రిబుల్ ఐటీ సీట్లు సాధించి ప్రభుత్వ పాఠశాలల గొప్పతనాన్ని చాటారు. మండలంలోని నర్మాల గ్రామ పాఠశాలలో ఉపాధ్యాయులు డిప్యూటేషన్లపై వెళ్లడంతో 6, 7, 8 తరగతుల విద్యార్థులకు పాఠాలు చెప్పేవారు లేకపోయారు. దీనిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేకుండా పిల్లలను పాఠశాలకు పంపడం వృధా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే జిల్లా కలెక్టర్, విద్యాశాఖ అధికారులు స్పందించి ఖాళీలను భర్తీ చేసి, పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని నర్మాల గ్రామస్థులు మొరపెట్టుకుంటున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి విద్యాశాఖలో నెలకొన్న ఈ ఇబ్బందులను పరిష్కరిస్తేనే ప్రభుత్వ బడులు మరింత బలోపేతం అవుతాయని మేధావులు అభిప్రాయపడుతున్నారు.

