వొడితల వర్సెస్ పాడి
ఇల్లందకుంటలో ‘క్రెడిట్’ వార్..
తహశీల్దార్ కార్యాలయ భవనం మంజూరుపై నేతల మధ్య క్రెడిట్ వార్
సొంత కృషి అంటూ ఎమ్మెల్యే ప్రకటన..
ప్రభుత్వ నిర్ణయమేనంటూ కాంగ్రెస్ నియోజకర్గ ఇన్చార్జి కౌంటర్
కాకతీయ, హుజూరాబాద్ : ఇల్లందకుంట మండల కేంద్రంలో కొత్త తహశీల్దార్ కార్యాలయ భవనం మంజూరు కావడం స్థానికంగా అభివృద్ధికి బాటలు వేసినా, రాజకీయంగా మాత్రం రగడ మొదలైంది. ఈ భవన మంజూరు తమ చొరవ వల్లే జరిగిందంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి వొడితల ప్రణవ్ వేర్వేరుగా ప్రకటనలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గత కొంతకాలంగా ఇల్లందకుంటలో కొత్త తహశీల్దార్ కార్యాలయం అవసరాన్ని తాను ప్రభుత్వ స్థాయిలో గట్టిగా వినిపించానని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు, జిల్లాకు చెందిన ఇతర మంత్రులకు పలుమార్లు వినతిపత్రాలు అందజేశానని, అసెంబ్లీలో కూడా ఈ అంశాన్ని ప్రస్తావించానని ఆయన గుర్తు చేశారు. తన పట్టుదల, నిరంతర కృషి వల్లే ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని, దీనివల్ల రెవెన్యూ సేవలు ప్రజలకు మరింత చేరువవుతాయని కౌశిక్ రెడ్డి వివరించారు.
వొడితల ప్రణవ్ ఖండన..!
ఎమ్మెల్యే వాదనను కాంగ్రెస్ ఇన్చార్జి వొడితల ప్రణవ్ తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకనే రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి వేగవంతమైందని, ఇల్లందకుంట భవన మంజూరు కూడా అదే కోవలోకి వస్తుందని ఆయన స్పష్టం చేశారు. మంత్రుల దృష్టికి సమస్యను తీసుకెళ్లడం ద్వారానే నిధులు మంజూరయ్యాయని, పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఏమీ చేయని వారు ఇప్పుడు క్రెడిట్ కోసం పాకులాడటం సరికాదని ప్రణవ్ కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రుల చిత్రపటాలకు పాలాభిషేకం చేసి సంబరాలు జరుపుకున్నారు. హుజూరాబాద్లో అభివృద్ధి పనుల విషయంలో క్రెడిట్ రాజకీయాలు కొత్తేమీ కాదని, గతంలోనూ పలు పనుల విషయంలో ఇరువర్గాల మధ్య ఇలాంటి వాదోపవాదాలే జరిగాయని స్థానికులు గుర్తు చేస్తున్నారు. అధికార, ప్రతిపక్షాల మధ్య నడుస్తున్న ఈ పోటాపోటీ ప్రకటనల వల్ల క్షేత్రస్థాయిలో పనులు సకాలంలో పూర్తవుతాయా లేదా అన్నదే ఇప్పుడు ప్రజల్లో ఉన్న ప్రధాన సందేహం. ఏది ఏమైనా, రాజకీయ పోరు పక్కన పెట్టి, భవన నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు.

