భూ సమీకరణపై రైతులతో అధికారుల చర్చలు
కాకతీయ, కారేపల్లి : సీతారామ ప్రాజెక్ట్లో భాగంగా చేపట్టనున్న భూ సమీకరణ (ల్యాండ్ పూలింగ్) అంశంపై పాటిమీదిగుంపు గ్రామ పంచాయతీ ఆవరణలో గురువారం ప్రత్యేక గ్రామ సభ నిర్వహించారు. సర్పంచ్ సుజాత-సంతోష్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రాజెక్టు వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలు, ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు మరియు భూ సమీకరణ ప్రక్రియపై అధికారులు రైతులకు అవగాహన కల్పించారు. ఈ గ్రామ సభలో ఎమ్మార్వో ఓరుగంటి వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ బి. పద్మ, ఫారెస్ట్ డిప్యూటీ రేంజర్, ఇరిగేషన్ డీఈ, పంచాయతీ సెక్రటరీ, ఆర్ఐ జగదీశ్, జీపీఓలతో పాటు వివిధ శాఖల అధికారులు, గ్రామ పెద్దలు, రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భూ సమీకరణ ప్రక్రియలో ప్రభుత్వం అనుసరిస్తున్న నిబంధనలు, రైతులకు అందే పరిహారం, ప్రాజెక్టు పూర్తయ్యాక భూముల విలువ పెరిగే అవకాశం వంటి అంశాలను అధికారులు సమగ్రంగా వివరించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు భూ సమీకరణపై తమ సందేహాలను అధికారుల ముందు ఉంచగా, వాటిని నివృత్తి చేసేందుకు సంబంధిత అధికారులు ప్రయత్నించారు. ప్రాజెక్టు అమలులో రైతుల భాగస్వామ్యం, వారికి ప్రభుత్వం అందించే హామీలపై చర్చించారు. తదుపరి చేపట్టాల్సిన చర్యలపై స్పష్టతనిస్తూ, రైతుల అభ్యంతరాలు మరియు విన్నపాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని అధికారులు పేర్కొన్నారు.

