- ఎన్ఎస్పీ కాలువపై అక్రమ నిర్మాణం..
- కామ్రేడ్ ముసుగులో కబ్జాపర్వం!
- అధికారులను ప్రభావితం చేస్తూ ఆక్రమణను కప్పిపుచ్చే యత్నం
- ఏదులాపురం పరిధిలో కాలువ స్థలాన్ని ఆక్రమించి భారీ నిర్మాణం
- గతంలోనూ వివాదాస్పద వ్యవహారాలతో వార్తల్లో సదరు నాయకుడు
- ఆధారాలతో కలెక్టర్ను ఆశ్రయించేందుకు స్థానికులు సన్నద్ధం

కాకతీయ, ఖమ్మం రూరల్ : పేదల కోసం త్యాగాలు చేస్తామని ప్రగల్భాలు పలికే ఓ మాజీ ప్రజా ప్రతినిధి.. తెర వెనుక మాత్రం ప్రభుత్వ ఆస్తులను మింగేస్తున్న ఉదంతం ఖమ్మం జిల్లాలో కలకలం రేపుతోంది. ఖమ్మం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 30వ వార్డు ఆటోనగర్లో ఎన్ఎస్పీ కాలువ భూమిని ఒక మాజీ నాయకుడు తన రాజకీయ హోదాను అడ్డుపెట్టుకుని ఆక్రమించి, అక్రమంగా నిర్మాణం చేపట్టినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ‘ఎర్ర చొక్కా’ వేసుకున్నంత మాత్రాన కామ్రేడ్ అయిపోరని, ప్రజా సేవకులను ఆదర్శంగా తీసుకోవాల్సింది పోయి, ప్రజలకు అందాల్సిన సాగునీటి మార్గాన్ని కబ్జా చేయడం ఏమిటని స్థానిక రైతులు మండిపడుతున్నారు. ఈ అక్రమ నిర్మాణం గురించి అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. ఇరిగేషన్ శాఖకు చెందిన ఓ చోటా అధికారి, సదరు నాయకుడికి బంధువు కావడంతో, కబ్జాను కప్పిపుచ్చేలా ఆయనే చక్రం తిప్పుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆక్రమణపై వచ్చిన ఫిర్యాదులను బుట్టదాఖలు చేస్తూ, అధికారులు ఆ నాయకుడికి వత్తాసు పలుకుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. గతంలో ఓ మహిళా అధికారిపై అనుచితంగా ప్రవర్తించి చట్టపరమైన చిక్కుల్లో పడిన సదరు నాయకుడు, ఇప్పుడు మళ్ళీ కాలువను ఆక్రమించి అక్రమాలకు పాల్పడటం గమనార్హం.

సాగునీటి కష్టాలు.. ఆక్రమణకు గురైన 312 సర్వే నంబర్
గోళ్లగూడెం వద్ద మొదలై ఆటోనగర్, వరంగల్ క్రాస్ రోడ్డు, పెద్దతండ మీదుగా గుర్రాలపాడు వరకు సుమారు వెయ్యి ఎకరాల సాగు భూములకు నీరందించే ఈ ఎన్ఎస్పీ కాలువ, ఇప్పుడు కబ్జా కోరల్లో చిక్కుకుంది. ఏదులాపురం రెవెన్యూ పరిధిలోని సర్వే నం. 312లో ఉన్న ఈ భూమిని గతంలోనే ప్రభుత్వం భూ సేకరణ చేసి నష్టపరిహారం చెల్లించింది. అటువంటి ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఇప్పుడు నిర్మాణం చేపట్టడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాగునీటి మార్గాన్ని మూసివేస్తే భవిష్యత్తులో వ్యవసాయం ఎలా సాగుతుందని రైతులు ప్రశ్నిస్తున్నారు.
కలెక్టర్ను ఆశ్రయించేందుకు సిద్ధం
ఈ అక్రమ నిర్మాణాన్ని తొలగించాలని, కాలువను పునరుద్ధరించాలని కోరుతూ స్థానికులు ఇప్పటికే పలుమార్లు అధికారులకు విన్నవించినా ఫలితం లేకపోయింది. దీంతో విసిగిపోయిన బాధితులు, సాక్ష్యాధారాలతో జిల్లా కలెక్టర్ను కలిసి ఫిర్యాదు చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ప్రభుత్వ భూమిని, అదీ సాగునీటి కాలువను ఆక్రమించి నిర్మాణం చేపట్టిన సదరు నాయకుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి కబ్జాను తొలగిస్తారా? లేక రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి మౌనం వహిస్తారా? అన్నది వేచి చూడాలి.

