కులం పేరుతో దూషిస్తే సహించేది లేదు : చందుపట్ల జనార్దన్
నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీసీ జేఏసీ డిమాండ్
హుజూరాబాద్ అంబేడ్కర్ కూడలిలో నిరసన ధర్నా
అగ్రకులాల ఆధిపత్య ధోరణిని ఖండించిన నాయకులు
కాకతీయ, కరీంనగర్: యాదవ సామాజిక వర్గానికి చెందిన ఈశ్వరమ్మ యాదవ్ను కులపరంగా దూషించిన వ్యక్తిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని బీసీ జేఏసీ గౌరవాధ్యక్షుడు చందుపట్ల జనార్దన్ డిమాండ్ చేశారు. స్వాతంత్ర్యం వచ్చి ఎనిమిది దశాబ్దాలు గడిచినా బీసీలపై అగ్రకులాల ఆధిపత్య ధోరణి తగ్గలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పాలకవర్గ సభ్యురాలిగా నియమితులైన ఈశ్వరమ్మ యాదవ్ సన్మాన ఫ్లెక్సీలో పేరు లేదనే నెపంతో శివచరణ్ రెడ్డి ఆమెను దుర్భాషలాడటం దారుణమని ఆయన పేర్కొన్నారు. బీసీలు పార్టీలకు అతీతంగా ఐక్యంగా సాగితేనే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలతో కలిసి రాజ్యాధికార సాధన కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.
చట్టపరమైన చర్యల కోసం డిమాండ్
కులపరంగా అవమానించే వ్యాఖ్యలకు పాల్పడిన నిందితులపై ప్రభుత్వం చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ అధ్యక్షుడు సందేల వెంకన్న, వన్నాల శివాజీ, చిలుకమారి శ్రీనివాస్, ఇప్పకాయల సాగర్, మావునూరి ప్రవీణ్ కుమార్, దేవసాని ప్రియదర్శిని, కొలిపాక క్రాంతి, అక్కినేపల్లి ప్రవీణ్ కుమార్, రామ్ సారయ్య, గడప రాజు, మేకల రవి, దొంత హరికిషన్, సొల్లు శంకర్, ఊదారపు కుమారస్వామి పాల్గొన్నారు.

